cricket ad

Sunday 18 December 2016

భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.. కళ్ళు చెదిరే వాస్తవాలు

అమ్మాయిలను కొనడం, అమ్మడం చేస్తూ వ్యభిచార కలాపాలు నిర్వహిస్తున్న ఓ పెద్ద ముఠా ని దేశ రాజధానిలో పోలీసులు అరెస్ట్ చేశారు. హుస్సేన్, సైరా అనే జంట.. అమ్మాయిలను డబ్బుకు కొని వ్యభిచారం చేయిస్తూ ఉన్నారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. దాడి చేసి పట్టుకున్నారు. కొంతమంది అమ్మాయిల చేత బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న ఈ జంట మరికొందరిని అమ్మేసింది కూడా. కాగా.. పోలీసులు దాడి చేయడంతో కళ్ళు చెదిరే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ సెక్స్ రాకెట్ ద్వారా వీళ్ళు సంపాదించిన మొత్తం సొమ్ము ఎంతో తెలుసా? అక్షరాలా 100 కోట్లు. వీళ్ళు  చేస్తున్న సెక్స్ రాకెట్ ఒక్క ఢిల్లీ కె పరిమితం కాదు. దేశం మొత్తం వ్యాపించింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఓడిస్సా, అసోం, పశ్చిమ బెంగాల్, నేపాల్ ల నుండి పెద్ద ఎత్తున అమ్మాయిలను అక్రమ రవాణా చేస్తూ 100 కోట్లకు పైగా కూడబెట్టారు. దాదాపు 5 వేలమంది అమ్మాయిలను ఈ సెక్స్ రాకెట్ లో ఉపయోగించుకున్నారు. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తుండటంతో మరింత లోతుగా విచారణ మొదలు పెట్టారు ఢిల్లీ పోలీసులు.

వడ్డీవ్యాపారం, మనీ లాండరింగ్ తో 400కోట్లు కూడబెట్టిన చాయ్ వాలా -

రద్దైన పెద్ద నోట్ల డిపాజిట్ గడువు దగ్గరపడేకొద్దీ ఐటీ అధికారులు స్పీడు పెంచారు. దేశవ్యాప్తంగా నల్ల కట్టలు మింగిన వారి బండారం బయటపెడుతున్నారు. రోజూ వందల కోట్ల నగదు, బంగారం, ఆస్తులు సీజ్‌చేస్తున్నారు. చెన్నైలో దాదాపు 200 కోట్ల నగదు, బంగారంతో శేఖర్ రెడ్డి ఐటీ అధికారులకే షాక్ ఇవ్వగా.. అంతకు మించి చుక్కలు చూపించాడు ఓ గుజరాతీ. ఏకంగా 400 కోట్ల ఆస్తులతో ఐటీ శాఖే బిత్తరపోయేలా చేశాడు. బ్లాక్‌మనీ అంటే ఏ బిజినెస్ మేనో, ప్రభుత్వ అధికారో లేదంటే ఏ కోటీశ్వరుడో వెనకేస్తాడు. కానీ ఒక  సాధారణ చాయ్ వాలా ఏకంగా 400 కోట్లు కూడబెట్టి ఐటీ అధికారులకు అదిరిపోయే షాకిచ్చాడు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత అక్రమార్కుల కోట్ల లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అందర్నీ మించిపోయిన కిషోర్ భజియావాలా అనే వ్యక్తిని ఐటీ అధికారులు సూరత్‌లో అదుపులోకి తీసుకున్నారు. భజియావాలా అంటే బజ్జీలు అమ్మే వ్యక్తి. చాయ్, బజ్జీలు అమ్ముతూ జీవితం ప్రారంభించిన కిషోర్..  తర్వాత ఆ డబ్బుతో వడ్డీ వ్యాపారం, మనీ లాండరింగ్ చేసి బాగా కూడబెట్టాడు. తర్వాత రాజకీయ నేతల అండతో అప్పులు  తీసుకున్న వారిని బెదిరించి వారి ఆస్తులును స్వాధీనం చేసుకుని కోట్లకు పడగెత్తాడు. అతడి ఇంట్లో జరిపిన సోదాల్లో అధికారులు 150 కోట్ల ఆస్తులు సీజ్ చేసారు. కోటీ 33 లక్షల నగదు, 7 కోట్ల విలువైన బంగారం, 70 లక్షల విలువైన వెండి కూడా పట్టుబడింది. భజియావాలా ఇంట్లో పట్టుబడ్డ వాటిలో 95 లక్షల విలువైన కొత్త 2 వేల నోట్లున్నాయి. ఈ మొత్తం ఆస్తులు,  నగదు విలువ సూమారు 400 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. పెద్ద నోట్ల రద్దు చేసిన తర్వాత రోజే.. సూరత్ లోని ఒక  బ్యాంకుకు భజియావాలా భారీ సంచులతో రావడం సీసీటీవీలో చూసి అతడిపై నిఘా పెట్టారు అధికారులు. విచారణలో సరైన సమాధానం చెప్పకపోవడంతో సూరత్ లోని అతడి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. బినామీ పేర్లతో వివిధ బ్యాంకుల్లో 30 అకౌంట్లు, 16 లాకర్లు గుర్తించి సీజ్ చేశారు. 
- See more at: http://www.tv5news.in/newsdetails.aspx?ID=63419&SID=79&Title=IT-Seizes-Rs-400-Crores-from-Tea-Seller-Turned-Financier-in-Surat#sthash.xf0sKBpI.dpuf

జయలలిత పాత్రలో రమ్యకృష్ణ...

తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రజలకు అనేక సేవలు అందించారు. అయితే అనారోగ్యంతో ఆమె కన్నుమూయడం తమిళ నాడుకు తీరని లోటు. అయితే ఆమె తన సేవల దృష్ట్యా ఎంతోమందిని ప్రభావితం చేశారు. ఆమె మరణం తరువాత ఆమె జీవితచరిత్రను తెరకెక్కించడానికి దర్శకులు రంగంలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో మొన్న వర్మ కూడా శశికళ అనే టైటిల్ ని రిజిస్టర్ చేసిన విషయం విదితమే !
అయితే జయలలిత అంటే తనకి ఎంతో అభిమానమనీ .. ఆమె పాత్రలో నటించాలని ఉందని త్రిష చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా రమ్యకృష్ణ కూడా తన డ్రీమ్ రోల్ జయలలిత పాత్ర అని చెప్పారు. తాజా సమాచారం ప్రకారం తమిళంలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు జయలలిత జీవిత చరిత్రను తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నాడట. ఈ పాత్ర కోసం రమ్యకృష్ణను సంప్రదించాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె కూడా ఓకే అన్నట్టు సమాచారం. బాహుబలి లో శివగామి పాత్రలో రమ్య అదరగొట్టిన విషయం విదితమే !

ఆ మంత్రి సహకారం.. కాచిగూడలో రూ. 44 కోట్ల భూమి కబ్జా

యంత్రాంగమంతా మంత్రాంగం దెబ్బకు మౌనం వహించింది. తొలుత గుడ్లురిమిన చట్టం ఆ తరువాత గుర్రుపెట్టి నిద్రపోయింది. సర్కార్‌కు దక్కాల్సిన రూ.44 కోట్ల విలువైన స్థలంలో ఓ ప్రైవేటు ఆస్పత్రి పక్కాగా పైకి లేచింది. వారసులు లేని వ్యక్తుల ఆస్తులు వారి తదనంతరం ప్రభుత్వానికే దక్కుతాయి. బోనా వేకెన్షియా చట్టం ఇదే చెబుతోంది. ఒకవేళ ఎవరైనా మేమే వారసులమని ముందుకొస్తే రెవన్యూ యంత్రాంగం విచారణ జరుపుతుంది. తగిన ఆధారాలు చూపించి వారసులుగా నిరూపించుకుంటేనే ఆస్తి వారిసొంతం అవుతుంది. కానీ హైదరాబాద్ నడిబొడ్డున గజం లక్షకు పైగా విలువ చేసే ఎకరాకు పైగా దిక్కులేని స్థలాన్ని అడ్డగోలుగా కొట్టేశారు. ఈ స్థలం ప్రభుత్వానిదేనని రెవెన్యూ అధికారులు పీకేసేని బోర్డును పీకేసి మరీ చెరబట్టారు.
 
కాచిగూడ స్టేషన్ రోడ్డులో టౌన్ సర్వే నెంబర్ 29, బ్లాక్-జే వార్డు నెం.190లో 4500 గజాల వివాదాస్పద స్థలం ఉంది. సుమారు రూ.44 కోట్ల విలువైన ఈ స్థలం సుమిత్రాబాయి అనే మహిళకు చెందింది. అయితే ఆమెకు వారసులెవరూ లేరు. దాంతో ఆమె మరణానంతరం కొందరు కబ్జాదారులు రంగంలోకి దిగారు. సుమిత్రాబాయి భర్త తాలూకు మనుషులం, మేమే వారసులం అంటూ తెరపైకి వచ్చారు. సదరు భూమిలో నిర్మాణాలు మొదలుపెట్టారు. స్థానికుల ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సమగ్ర విచారణ అనంతరం 2008 మార్చి 13వ తేదీన బోనావేకెన్షియా యాక్ట్-1974, సెక్షన్ 7, 8 ప్రకారం ఈ స్థలం అంతా ప్రభుత్వానిదేనని అధికారులు నిర్థారించారు. ఆ వెనువెంటనే భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పలు విజ్ఞప్తులు, విచారణల నేపథ్యంలో వారసులు మీరే అనే పత్రాలు సమర్పించండని 2011 ఏప్రిల్ 27న జిల్లా కలెక్టర్ సంబంధిత వ్యక్తులకు సమన్లు జారీచేశారు. సరైన డాక్యూమెంట్లు లేకపోవడంతో కబ్జాదారులు ముఖం చాటేశారు. కలెక్టర్ ముందుకు వెళ్లకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నిబంధనల ప్రకారం విచారణ జరిపిన అధికారులు స్థలం ప్రభుత్వానికే చెందుతుందని నిర్థారించారు. దీన్ని క్లేయిమ్ చేస్తున్నవారికి 2014 జూన్ 18న మరోసారి సమన్లు జారీచేశారు. ఒరిజినల్ ధ్రువపత్రాలను సమర్పించాలని స్పష్టం చేశారు. అయితే పత్రాలు సమర్పించకపోవడంతో స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇది ప్రభుత్వ స్థలమంటూ అక్కడ బోర్డు కూడా పెట్టింది. నిర్మాణ అనుమతులు నిలిపివేయాలని జీహెచ్ఎంసీకి లేఖ కూడా రాసింది. అనుమతి లేకుండా కడుతున్న నిర్మాణాలను కూల్చివేయాలని కూడా కోరింది.
 
విలువైన స్థలం చేజారిపోవడంతో కబ్జాదారులు ఖంగుతిన్నారు. అప్పటికీ తమ ప్రయత్నాలను విడిచిపెట్టకుండా బడా లాబీని ఆశ్రయించారు. నగరం నడిమధ్యలో స్థలం ఉండటం, పక్కనే కాచిగూడా రైల్వే స్టేషన్ ఉండటం. దిక్కులేని భూమిలో కట్టిన నిర్మాణం అంతా ఆస్పత్రిఅవసరాలకు సరిపోయేలా ఉండటంతో రాజకీయంగా పరపతి కలిగిన ఓ ఆస్పత్రి యాజమాన్యం రంగంలోకి దిగింది. వీరికి ఓ మంత్రి సహకారం అందించారు. కబ్జాదారుల నుంచి ఈ స్థలాన్ని సదరు ఆస్పత్రి యాజమాన్యం సొంతం చేసుకుంది. ఆ తరువాత పరిస్థితి మొత్తం మారిపోయింది. స్థలం ప్రభుత్వానిదే అంటూ అప్పటిదాకా పరుగులు పెట్టిన ఫైళ్ల కాళ్లు చచ్చుబడ్డాయి. ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు నిలిపివేయాలి అని జీహెచ్ఎంసీకి జిల్లా యంత్రాంగం లేఖ రాసినా బల్దియా అటువైపు కన్నెత్తి చూడలేదు. స్థానికులు, రెవెన్యూ యంత్రాంగం అభ్యంతరాలన్నీ బుట్టదాఖలయ్యాయి. ఆస్పత్రి నిర్మాణం దర్జాగా పూర్తైంది. ఈ ఏడాది అక్టోబర్ మొదటివారంలో కరీనాకపూర్, సైఫ్ అలీఖాన్ తదితర బాలీవుడ్ తారలు ప్రముఖ రాజకీయ నేతల సమక్షంలో అట్టహాసంగా ఆస్పత్రి ప్రారంభోత్సవం జరిగింది.

ఒక భార్య... 11 మంది భర్తలు... ఇది కథ కాదు జరిగిన ఘటన!

అందంతో వలేస్తుంది. మాటలతో మత్తెకిస్తుంది. ముగ్గులోకి దింపుతుంది. ప్రేమించుకుందాం... ప్రేమంటే ఇదేరా అనే రేంజ్‌లో బిల్డప్ ఇచ్చి పెళ్లి చేసుందాం రా అని పిలుస్తుంది. ఆ మాటలను నమ్మి పెళ్లి పీటలెక్కి తాళి కడితే చాలు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగిన అరుదైన మోసమిది. నిత్య పెళ్లి కొడుకులను, పెళ్లి కూతుళ్ల గురించి వినే ఉంటారు. అయితే, ఈ యువతి నిత్య పెళ్లి కూతుళ్ల జాబితాలో నెం.1 స్థానాన్ని దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమించినట్టుంది. అందుకే, ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 11 మంది అబ్బాయిలను ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లి చేసుకుని నిండా ముంచింది. ఈ యువతి బాగోతం గురించి తెలిసిన ఈ 11 మందిలో చివరివాడైన కేరళలోని కొచ్చికి చెందిన లోరెన్ జస్టిన్ తన భార్య మేఘా కనిపించడం లేదని, ఆరోజు నుంచే 15లక్షల డబ్బు, బంగారం కూడా మాయమైందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసును విచారించిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. ఆమె నోయిడాలో పోలీసులకు దొరికిపోయింది.
 
పెళ్లి కాని డబ్బున్న అబ్బాయిల వివరాలను మ్యాట్రిమొనీలో సేకరించి, వారికి తన ఫోటో పంపించేదని విచారణలో తేలింది. డబ్బున్న అబ్బాయిల్లో కూడా ఎవరైతే కొంచెం అందవికారంగా ఉంటారో, విడాకులు తీసుకున్న వారు, అంగ వైకల్యం కలిగి ఉంటారో అలాంటి వారినే ఆమె టార్గెట్ చేసేదని తెలిసింది. ఆమె అందంగా ఉండటంతో తమ అదృష్టం కొద్దీ ఈ అమ్మాయి దొరికిందని భావించి ఆ యువతి గురించి అసలు వివరాలేవీ తెలుసుకోకుండా పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొద్ది రోజులు అణకువ కలిగిన భార్యగా నటించి, అన్నీ దోచుకుని వెళ్లిపోవడం ఆమె స్టైల్. ఆ యువతి పేరు మేఘా భార్గవ్. ఇండోర్ ఆమె స్వస్థలం. ఈ ఘరానా మోసాలకు ఆమె చెల్లి, బావ కూడా సహకరిస్తుండటం కొసమెరుపు. ఒక్క కేరళ రాష్ట్రంలోనే నలుగురు యువకులు ఈ యువతి మోసానికి బలయ్యారు. సో అమ్మాయి అందంగా ఉందని ముందూవెనుక ఆలోచించకుండా ప్రేమ, పెళ్లి అంటే మొదటికే మోసమొస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పెళ్లి కాని ప్రసాదులు... బీ అలర్ట్.

సూరత్ వజ్రాల వ్యాపారికి నోటీసులు

 దీపావళి బోనస్‌గా తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు వందలాది కార్లు, ఫ్లాట్లు, బంగారు ఆభరణాలు పంచిపెట్టి కార్పొరేట్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసిన సూరత్ వజ్రాల వ్యాపారి గుర్తున్నాడా...? ఆయన ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు... అయితే ఈ సారిమాత్రం మంచిపని చేసి కాదు... రూ.6 వేల కోట్ల ‘హరే కృష్ణ ఎక్స్‌పోర్టు’ కంపెనీ చైర్మన్ సావ్‌జీ డోలాకియా తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల పీఎఫ్ కోసం చెల్లించాల్సిన రూ.16.66 కోట్లు కట్టలేదు. దీంతో డోలాకియాపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సిద్ధమైంది. పీఎఫ్ ఎగవేసినందుకు గానూ ఆయనకు ఇప్పటికే తుది నోటీసులు జారీ చేసిన ఈపీఎఫ్‌వో... సదరు కంపెనీ బ్యాంకు ఖాతాలను కూడా స్తంభింపజేసే అవకాశాలు ఉన్నాయి. వజ్రాల కార్మికులతో కలిపి ప్రస్తుతం ఆయన కంపెనీలో మొత్తం 3,165 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే ఈపీఎఫ్‌లో మాత్రం కేవలం 17 మందిని మాత్రమే నమోదు చేయడం ద్వారా ఈ కంపెనీ భవిష్యనిధి, పారిశ్రామిక చట్టాలను ఉల్లంఘించింది. చాలా ఏళ్లుగా ఉద్యోగులకు పీఎఫ్ చెల్లించకపోవడంతో ఈ వ్యవహారంపై రెండేళ్ల పాటు విచారణ జరిపిన ఈపీఎఫ్‌వో.... 15 రోజుల్లోగా రూ.16.66 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీచేసింది. 2014 దీపావళి సందర్భంగా డొలాకియా తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు 491 కార్లు, 207 ఫ్లాట్లు బోనస్‌గా ఇచ్చారు.

Saturday 17 December 2016

టన్నుల బంగారం కొట్టేసి.. పిచ్చి నాటకాలు!

అది 1857వ సంవ‌త్స‌రం… అట్లాంటిక్ మ‌హా స‌ముద్రంలో మూడు ట‌న్నుల బంగారంతో ఓ భారీ నౌక బ‌య‌లు దేరింది. అనుకోకుండా ఓ పెద్ద తుఫాను వ‌చ్చింది. భారీ నౌక న‌డిసంద్రంలో మునిగిపోయింది. క‌ట్ చేస్తే  130 సంవ‌త్స‌రాల త‌ర్వాత అంటే 1988లో  మునిగిన నౌక‌లో ఉన్న మూడు ట‌న్నుల బంగారం థామ్స‌న్ అనే వ్య‌క్తి వెలికి తీసిన‌ట్లు పోలీసులు గుర్తించారు. అప్ప‌టి నుంచి థామ్స‌న్ కోసం పోలీసులు వెతుకుతున్నా  వారి క‌ళ్లు క‌ప్పి ఎంతో చాక‌చ‌క్యంగా త‌పిపంచుకుతిరుగుతున్నాడు. ఇదంతా సినిమా స్టోరీలా ఉన్న‌ప్ప‌టికీ ఇదే నిజం. ఈ ఘ‌ట‌న అమెరికాలో చోటుచేసుకుంది.
వివ‌రాల్లో కెళితే … ఈ బంగారాన్ని స‌ముద్ర‌పుటంచులనుంచి బ‌య‌ట‌కు తీసేందుకు థామ్స‌న్ త‌న స్నేహితుల సహకారం కోరాడు. బంగారాన్ని విజయవంతంగా బయటకు తీసుకొస్తే వారికి కూడా వాటా ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. బంగారాన్ని సముద్రం నుంచి తీసేందుకు థామ్సన్ ఓ రోబోను తయారు చేశాడు. ఇది 8000 అడుగున ఉన్న బంగారాన్ని వెలికి తీయగలే సామర్థ్యం ఉంది. ఈ రోబోను తయారు చేసేందుకు కావాల్సిన డబ్బును థామ్సన్ స్నేహితులే సమకూర్చారు. అంతా రెడీ అయిన తర్వాత రోబోను సముద్రంలోకి వదిలి మొత్తానికి మూడు టన్నుల బంగారాన్ని బయటకు తీసుకొచ్చాడు.   ఆ తర్వాత మొత్తం బంగారంతో థామ్సన్ ఉడాయించాడు.
2000వ సంవత్సరంలో తమకు న్యాయం చేయాల్సిందిగా థామ్సన్  మిత్రులు కోర్టుమెట్లెక్కారు.  ఆ బంగారాన్ని ఎప్పుడో అమ్మేసినట్లుగా థామ్సన్ కోర్టుకు సమాధానం ఇచ్చాడు. 2012లో కోర్టుకు హాజరుకావాల్సిందిగా న్యాయస్థానం  థామ్సన్ కు నోటీసులు జారీ చేసింది. కోర్టు నోటీసులకు స్పందించకపోవడంతో థామ్సన్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఫెడరల్ కోర్టు. ఇక అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు.
రంగంలోకి దిగిన FBI థామ్సన్ కోసం వేట సాగించింది. మారు పేర్లతో విలాసవంతమైన హోటళ్లలో థామ్సన్ నివసించేవాడు. పక్కా సమాచారం అందుకున్న FBI పోలీసులు 2015 జనవరిలో ఓ హోటల్లో థామ్సన్ ను అదుపులోకి తీసుకున్నారు. మూడు టన్నుల బంగారంపై ఆరా తీశారు. అయితే ఆ బంగారం సంగతి గురించి తనకేమీ తెలియదని బుకాయించాడు. అది ఎక్కడుందో తనకు గుర్తులేదని చెబుతున్నాడు. థామ్సన్ తరపున వాదిస్తున్న లాయరు కూడా తన క్లైంట్ మెమొరీ లాస్ వ్యాధితో బాదపడుతున్నాడని తనకు ఏమీ గుర్తుండదని వాదించాడు.
ఈ కేసు నుంచి తప్పించుకునేందుకే థామ్సన్ మెమొరీ లాస్ డ్రామాను తెరపైకి తెచ్చాడని భావించిన కోర్టు… ఆ బంగారు నిధి గురించి వివరాలు చెప్పేవరకు జైలులోనే ఉంచాల్సిందిగా ఆదేశాలు ఇస్తూ రోజుకు 1000 డాలర్లు జరిమానా విధించింది.