cricket ad

Sunday 18 December 2016

సూరత్ వజ్రాల వ్యాపారికి నోటీసులు

 దీపావళి బోనస్‌గా తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు వందలాది కార్లు, ఫ్లాట్లు, బంగారు ఆభరణాలు పంచిపెట్టి కార్పొరేట్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసిన సూరత్ వజ్రాల వ్యాపారి గుర్తున్నాడా...? ఆయన ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు... అయితే ఈ సారిమాత్రం మంచిపని చేసి కాదు... రూ.6 వేల కోట్ల ‘హరే కృష్ణ ఎక్స్‌పోర్టు’ కంపెనీ చైర్మన్ సావ్‌జీ డోలాకియా తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల పీఎఫ్ కోసం చెల్లించాల్సిన రూ.16.66 కోట్లు కట్టలేదు. దీంతో డోలాకియాపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సిద్ధమైంది. పీఎఫ్ ఎగవేసినందుకు గానూ ఆయనకు ఇప్పటికే తుది నోటీసులు జారీ చేసిన ఈపీఎఫ్‌వో... సదరు కంపెనీ బ్యాంకు ఖాతాలను కూడా స్తంభింపజేసే అవకాశాలు ఉన్నాయి. వజ్రాల కార్మికులతో కలిపి ప్రస్తుతం ఆయన కంపెనీలో మొత్తం 3,165 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే ఈపీఎఫ్‌లో మాత్రం కేవలం 17 మందిని మాత్రమే నమోదు చేయడం ద్వారా ఈ కంపెనీ భవిష్యనిధి, పారిశ్రామిక చట్టాలను ఉల్లంఘించింది. చాలా ఏళ్లుగా ఉద్యోగులకు పీఎఫ్ చెల్లించకపోవడంతో ఈ వ్యవహారంపై రెండేళ్ల పాటు విచారణ జరిపిన ఈపీఎఫ్‌వో.... 15 రోజుల్లోగా రూ.16.66 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీచేసింది. 2014 దీపావళి సందర్భంగా డొలాకియా తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు 491 కార్లు, 207 ఫ్లాట్లు బోనస్‌గా ఇచ్చారు.

No comments:

Post a Comment