cricket ad

Saturday 10 December 2016

మరో బాలీవుడ్‌ నటి ప్రేమలో జహీర్‌?



భారత్‌లో బాలీవుడ్‌కు, క్రికెటర్లకు మధ్య అనుబంధం ఇప్పటిది కాదు. వారి మధ్య ప్రేమలు, పెళ్లిల్లు సాధారణమే. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ ఆలీఖాన్‌ తల్లిదండ్రులైన మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడి, షర్మిలా ఠాగూర్‌ల ప్రేమాయణం నుంచి నేటి విరాట్‌ కోహ్లీ, అనుష్కా శర్మల లవ్‌స్టోరీ వరకు మనకు పరిచయమే. ఇటీవలె డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ యువరాజ్‌ సింగ్‌, నటి హాజెల్‌ కీచ్‌లు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 
తాజాగా ఈ జాబితాలో టీమిండియా మాజీ ఫాస్ట్‌బౌలర్‌ జహీర్‌ఖాన్‌ చేరినట్టు సమాచారం. జహీర్‌ ఇంతకుముందే ఇషా శర్వాణీ (కిస్నా ఫేమ్‌) అనే బాలీవుడ్‌ హీరోయిన్‌తో ప్రేమాయణం సాగించాడు. అయితే ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు. ఇప్పుడు జహీర్‌ మరో బాలీవుడ్‌ హీరోయిన్‌కు దగ్గరైనట్టు సమాచారం. ఆమె ఎవరో కాదు షారూక్‌ నటించిన ‘చక్‌ దే ఇండియా’లో నటించిన బెంగాలీ నటి సాగరికా ఘట్గే. జహీర్‌, సాగిరకలు ప్రస్తుతం ప్రేమలో మునిగి తేలుతున్నట్టు సమాచారం. వీరిద్దరూ జంటగా యువరాజ్‌ పెళ్లి వేడుకకు కూడా హాజరై కనువిందు చేశారు. 
యువీకి వివాహ శుభాకాంక్షలు చెప్పిన క్రికెటర్‌ రోహిత్‌ శర్మ.. నెక్ట్స్‌ జహీరే అని ట్వీట్‌ చేశాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన జహీర్‌ త్వరలోనే సాగిరకతో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు కోడై కూస్తోంది బాలీవుడ్‌ మీడియా.

పార్టీలో రచ్చరచ్చ చేసిన సైఫ్ అలీఖాన్ కూతురు!

బాలీవుడ్‌లో స్టార్ హీరోహీరోయిన్ల కొడుకులు, కూతుళ్లకు స్వేచ్ఛ మరీ ఎక్కువైపోయినట్టుంది. రోజూ పార్టీలు చేసుకుంటూ డబ్బుంది కదా అని పబ్బుల్లో గడిపేస్తున్నారు. కొందరైతే శ్రుతిమించిపోయి బాయ్‌ఫ్రెండ్స్‌ను తల్లిదండ్రుల కళ్ల ముందే వెంటేసుకుని తిరుగుతున్నారు. డబ్బున్న వారికి ఇలాంటివన్నీ సహజం అని సమర్థించినా, కొందరు స్టార్ హీరోలు, హీరోయిన్లు మాత్రం బిడ్డల ప్రవర్తనతో బాధపడుతున్నారు. తాజాగా సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్‌కు సంబంధించిన ఫోటోలు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అమితాబ్‌బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా 19వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ పార్టీలో బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్ల పిల్లలదే హవా. జావిద్ జాఫ్రీ కూతురు అలవియా జాఫ్రీ, ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ ఈ పార్టీలో హంగామా చేశారు. ఫుల్లుగా తాగుతూ, ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటూ మత్తులో నానా హంగామా చేశారు. ఇప్పుడీ ఫోటోలు వీరి కుటుంబాలకు కొత్త తలనొప్పిని తెచ్చి పెట్టాయి

ప్రభువు ఎవరు?

ఏసు ఎవరు? లోక రక్షకుడా? కేవలం ఒక కార్యాన్ని నిర్వర్తించటానికి వచ్చిన దైవదూతా? లేక ఎప్పుడూ మనని కనిపెట్టి ఉండే దేవుడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం బైబిల్‌లో దొరుకుతుంది..

‘నేనే ద్వారమును.. నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచుండును’ (యోహాను 10:9) ఈ వాక్యాన్ని విడివిడిగా విశ్లేషిస్తే క్రీస్తుతత్వం అర్థమవుతుంది.

నేనే ద్వారమును: యొహోవాను చేరటానికి ఏసు తప్ప వేరే మార్గము లేదు. ఆయన సూచించిన మార్గంలో ప్రయాణిస్తే ఎలాంటి అలసట ఉండదు. మెరుగైన జీవితం పొందగలుగుతారు. దైనందిక జీవితంలో శాంతి, సంతోషాలు లభిస్తాయి. ఇవన్నీ కావాలంటే ఏసు అనే ద్వారం నుంచే అందరూ ప్రవేశించాలి.

‘ఎవడైనను’- అనే పదాన్ని ఉపయోగించటం ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి అవసరాలను తానే తీరుస్తాననే భరోసాను క్రీస్తు ఇస్తున్నాడు.

‘రక్షింపబడినవాడై’- ఈ ప్రపంచంలో అడుగడుగునా అనేక ప్రమాదాలుంటాయి. వీటిన్నింటినీ సురక్షితంగా దాటాలంటే అపరిమితమైన ప్రేమ, కరుణలతో పాటుగా అభేధ్యమైన శక్తి కూడా అవసరం. వీటన్నింటినీ మనకు క్రీస్తు ప్రసాదిస్తాడు. ఆయన సహవాసంలో జీవించేవారు తప్పకుండా రక్షణ పొందుతారు. ఆయన సున్నిత హస్తాలు, మృదువైన మనసు, తేజోవంతమైన వర్ఛస్సును అనుభూతి చెందగలుగుతారు. కాబట్టే ‘ఎవడైనను లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడును’ అని ప్రభువు సెలవిచ్చాడు. నిజాయితీగా మనను మనం క్రీస్తుకు అర్పించుకుంటే- ఆయన మన తరపున పోరాడతాడు.

‘లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచుండును’-
అనే వాక్యం లోపల నిగూఢమైన అర్థం ఉంది. ఈ వాక్యంలో మనిషి ఆనందంగా జీవించటానికి అవసరమైన భద్రత, వనరులు, పని- ఈ మూడింటినీ తానే అందిస్తానని క్రీస్తు చెబుతున్నాడు. అంతే కాకుండా గొర్రెలమైన మనల్ని దారి తప్పకుండా ఒక క్రమపద్ధతిలో ముందుకు తీసుకుపోయే బాధ్యతను కూడా ప్రభువు తనపై వేసుకున్నాడు.

ఈ వాక్యం ఆధారంగా చూస్తే నిజాయితీగా ప్రభువును స్తుతించటం ద్వారానే నిజమైన సుఖసంతోషాలు లభిస్తాయనే విషయం అర్థమవుతుంది.
 
ఆయన సున్నిత హస్తాలు, మృదువైన మనసు, తేజోవంతమైన వర్ఛస్సును అనుభూతి చెందగలుగుతారు. నిజాయితీగా మనను మనం క్రీస్తుకు అర్పించుకుంటే- ఆయన మన తరపున పోరాడతాడు.

లోక్‌సభలో నన్ను మాట్లాడనివ్వడం లేదు... రాష్ట్రపతి ఆవేదన చెందుతున్నారు : మోదీ

గొప్ప రాజకీయ అనుభవం ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రస్తుత పార్లమెంటు సమావేశాల తీరుపై తీవ్ర ఆవేదన చెందుతున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో దీసా వద్ద జరిగిన రైతు సభలో ఆయన మాట్లాడుతూ చర్చకు సిద్ధమేనని ప్రభుత్వం నిరంతరం చెప్తోందన్నారు. కానీ తనను లోక్‌సభలో మాట్లాడనివ్వడంలేదని మోదీ చెప్పారు. లోక్‌సభలో తనను మాట్లాడనివ్వకపోవడం వల్లే తాను జన సభలో మాట్లాడుతున్నానని తెలిపారు. మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభ్‌ భాయ్ పటేల్ పుట్టిన గడ్డపై నుంచి తాను ప్రతిపక్ష మిత్రులకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నానన్నారు. ఎన్నికల సమయంలో వాడివేడి చర్చలు జరిగిన విషయం వాస్తవమేనని, మనమంతా ఎక్కువ మంది ఓటర్లు ఓటు వేయాలని పిలుపునిచ్చామని చెప్పారు. అదేవిధంగా ప్రతిపక్ష సభ్యులు తనను వ్యతిరేకించవచ్చునని, అయితే ప్రజలకు బ్యాంకింగ్ గురించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆర్థిక లావాదేవీలను నిర్వహించడం గురించి వివరంగా చెప్పాలని కోరారు. పేదల గురించి కేవలం మాట్లాడటానికి, వాళ్ళ కోసం పని చేయడానికి చాలా తేడా ఉందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం పేదల కోసం పని చేస్తోందన్నారు.
 
పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 16న ప్రారంభమయ్యాయి. పెద్ద నోట్ల రద్దుపై చర్చ జరగాలంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు గట్టిగా కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు కార్యకలాపాలు సజావుగా సాగడంలేదు. అర్ధాంతరంగా వాయిదా పడుతున్నాయి. ఈ పరిస్థితిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పందిస్తూ ఎంపీలను ప్రజలు తమకు ప్రతినిధులుగా పార్లమెంటుకు పంపించారని, ఆ అవకాశాన్ని పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకోవడానికి ఉపయోగించవద్దని సుతిమెత్తగా హెచ్చరించారు.

జయలలిత ఒకరోజు ముందే చనిపోయారా?

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గుండెపోటుతో చనిపోయిన సంగతి తెలిసిందే. ఆసుపత్రి ప్రకటించిన వివరాల ప్రకారం ఆమె కన్నుమూసింది డిసెంబర్ 5న. కానీ ఆమె ఒకరోజు ముందే చనిపోయిందని తెలుస్తోంది. డిసెంబర్ 4న, ఆదివారమే ఆమె కన్నుమూసినట్లు సమాచారం. అన్నాడీఎంకే నేతలు ఆదివారం సాయంత్రం నుంచే అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఆమె పార్థివదేహాన్ని ఉంచిన రాజాజీ హాల్‌ను కూడా శుభ్రం చేయాలని ఆదివారమే ఆదేశాలు అందాయట. దీంతో పార్టీ కీలక నేతలకు ఆమె చనిపోయిందన్న విషయం తెలిసుంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అపోలో ఆసుపత్రి యాజమాన్యం కూడా అధికార పార్టీ నేతల ఆదేశాల ప్రకారమే సోమవారం అర్థరాత్రి ప్రకటన చేసినట్లు సమాచారం. ఆమె ఆదివారమే చనిపోతే సోమవారం అర్థరాత్రి వరకూ ఎందుకు గోప్యంగా ఉంచారనేది అంతుచిక్కని ప్రశ్న. ఆ ఒక్కరోజులో ఏం జరిగిందనే విషయంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

శశికళపై సంచలన ఆరోపణలు చేసిన జయలలిత చెల్లి కూతురు!

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 5న అపోలో ఆస్పత్రిలో కన్నుమూసిన విషయం విదితమే. అయితే, ఆమె మరణానంతరం ప్రజల్లో ఎన్నో సందేహాలు, మరెన్నో అంతు చిక్కని ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. జయలలితది సహజ మరణం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. జయలలిత అక్కున చేర్చుకుని, సొంత మనిషి కంటే ఎక్కువగా నమ్మిన శశికళే జయలలిత హత్యకు కుట్రపన్నిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రిలో చికిత్స జరిగిన 75రోజులు సొంత మనుషులను కూడా ఆసుపత్రిలోకి రానివ్వకుండా, శశికళే అన్నీ తానై వ్యవహరించింది. దీంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
 
జయలలిత చిన్న చెల్లి కూతురు అమృత బెంగళూరులో ఉంటోంది. తమ ఆంటీతో మాట్లాడనివ్వకుండా శశికళ కుట్రపూరితంగా వ్యవహరించేదని అమృత చెప్పింది. జయలలిత ఆసుపత్రిలో ఉండగా చూడటానికి 3 సార్లు వెళ్లానని, ఒక్కసారి కూడా శశికళ తనను లోపలికి అనుమతించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. జయలలిత ఆస్తిని ప్రభుత్వ పరిధిలోకి తెచ్చి తమిళనాడు ప్రజలకు దక్కేలా చూడాలని, అప్పుడే ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుందని అమృత భావించింది. జయలలిత ఆస్తి దక్కించుకోవాలని శశికళ కుట్ర పన్నిందని అమృత సంచలన ఆరోపణలు చేశారు.

వాళ్ళను బలోపేతం చేయడానికే నోట్ల రద్దు : ప్రధాని మోదీ

 పెద్ద నోట్ల రద్దు వల్ల విచారంగా ఎవరున్నారో, ఎవరు బలపడుతున్నారో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వివరించారు. అవినీతి వల్ల పేదలు, సామాన్యులు అనుభవిస్తున్న ఇబ్బందులను గుర్తు చేశారు. కరెన్సీ కష్టాల నుంచి ఎలా గట్టెక్కాలో వివరించారు. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో దీసా వద్ద అమూల్ పాల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. ‘అమూల్ దేశీ’ ఏ2 ఆవు పాలను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన రైతు సభలో మోదీ మాట్లాడారు.
 
ఇప్పుడు ఎక్కడ చూసినా పెద్ద నోట్ల రద్దు గురించే మాట్లాడుకుంటున్నారని, పేదలను బలోపేతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మోదీ చెప్పారు. రూ.500, రూ.1,000 నోట్ల రద్దు వల్ల రూ.50, రూ.100 నోట్ల విలువ పెరిగిందన్నారు. అంతేకాకుండా ఉగ్రవాదులను, నకిలీ కరెన్సీ ముఠాలను బలహీనపరచగలిగామని పేర్కొన్నారు. అవినీతి వల్ల ఎవరు నిరుత్సాహపడుతున్నారని ప్రశ్నిస్తూ అవినీతికి పాల్పడుతున్నవాళ్ళకు విచారం లేదని, పేదలు, సామాన్యులే అవినీతి వల్ల ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ‘నాకేం ఒరిగింది’ అని ఆలోచించని మనుషులున్న దేశంలో మనం ఉన్నామన్నారు. మన దేశం స్వార్థపూరితమైనది కాదన్నారు. మనమంతా మన భావి తరాల గురించి ఆలోచిస్తామన్నారు. పేదల గురించి మాట్లాడటానికి, వారికోసం పని చేయడానికి తేడా ఉందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తోందని తెలిపారు. ‘‘50 రోజుల సమయం ఇవ్వమని అడిగాను. పరిస్థితులు ఎలా మారుతాయో మీరే చూస్తారు. అవినీతి నుంచి దేశాన్ని బయటపడేసేందుకు ఇది కీలకమైన ముందడుగు’’ అని మోదీ చెప్పారు.
 
‘‘నల్లధనం పోగేసుకున్న బ్యాంకు అధికారులు, ఇతరులు ఎలా అరెస్టవుతున్నారో చూడండి. దొడ్డిదారిన తప్పించుకోగలమని వాళ్ళు అనుకున్నారు, కానీ దొడ్డిదారిలో కూడా కెమెరాలను మోదీ అమర్చినట్లు వాళ్ళు తెలుసుకోలేదు’’ అని ప్రధాని మోదీ తెలిపారు. ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నానన్నారు. ఈ-బ్యాంకింగ్, ఈ-వాలెట్‌లను అలవాటు చేసుకుంటే ఏటీఎంలు, బ్యాంకుల వద్ద నిల్చుని సమయాన్ని వృథా చేసుకోవలసిన అవసరం ఉండదన్నారు. ఈ-వాలెట్లు బ్యాంకులను మీ మొబైల్స్‌లోకి తీసుకొచ్చాయన్నారు.