cricket ad

Tuesday 13 December 2016

బ్యాంకుల్లో అక్రమాలపై సీరియస్..! దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో సోదాలు..!

పెద్దనోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కొంత మంది బ్యాంకు సిబ్బంది నల్లకుబేరులతో కుమ్మక్కై అక్రమాలకు తెరతీశారు. కమిషన్ తీసుకుని పాత నోట్లను భారీ ఎత్తున మారుస్తున్నారు. ఈ క్రమంలో, బ్యాంకులకు డబ్బు వస్తున్నప్పటికీ, సామాన్యులకు మాత్రం అందుబాటులోకి రాకుండా పోతోంది. దీంతో, ఈ అంశంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించింది.
దేశవ్యాప్తంగా 54 బ్యాంకులపై ఈడీ దాడులు నిర్వహించింది. బ్యాంకులపై దాడి చేసి, తనిఖీలు నిర్వహిస్తోంది. డబ్బు రవాణా, మనీ లాండరింగ్ అంశాలపై కూడా ఆరా తీస్తోంది. ఈడీ దాడులు చేసిన బ్యాంకుల్లో ప్రముఖ బ్యాంకులన్నీ ఉన్నాయి.
ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఇటీవలే పలువురు బ్యాంకు అధికారులపై కేంద్రం కొరడా ఝళిపించిన సంగతి తెలిసిందే. పలువురి సస్పెండ్ చేయడంతో పాటు పలువురిని బదిలీ చేసింది.

రూ.500కోట్లతో కూతురి పెళ్లి చేసిన గాలి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!

500 కోట్ల రూపాయల ఖర్చుతో కూతురి పెళ్లి అంగరంగ వైభవంగా పెళ్లి చేసిన కర్నాటక మైనింగ్ డాన్, మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గాలి జనార్దన రెడ్డిపై నల్ల ధనం మార్పిడి ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాలి జనార్దన రెడ్డి సన్నిహితుడు, భూ సమీకరణ ప్రత్యేక అధికారి భీమా నాయక్ ను పోలీసులు అరెస్టు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి వద్ద ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు సాయం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భీమా నాయక్ తో పాటు అతని కారు డ్రైవర్ మహ్మద్ ను గుల్బర్గాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె పెళ్లి సమయంలో సుమారు రూ.100 కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు భీమా నాయక్ సహాయాన్ని తీసుకున్నారని, ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ నాయక్ కారు డ్రైవర్ రమేశ్ గౌడ తన సూసైడ్ నోట్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.
గాలి జనార్దన్ రెడ్డి తన కూతురి పెళ్లికి డబ్బుని నీళ్ల ప్రాయంలా ఖర్చు చేశారు. పెళ్లి కూతురి చీర ఖరీదే 17 కోట్ల రూపాయలు కాగా, ఆభరణాల ఖరీదు 90కోట్ల రూపాయలు. నోట్లరద్దు వేళ దేశవ్యాప్తంగా ప్రజలు కరెన్సీ కోసం పాట్లు పడుతుంటే, 2వేల రూపాయల నోటు దొరకడం కూడా గగనంగా ఉంటే, గాలి జనార్దన రెడ్డి మాత్రం కోట్ల రూపాయల డబ్బుని అవలీలగా ఖర్చు చేయడం సంచలనంగా మారింది.

సెల్ ఫోన్లకు సైబర్ కేటుగాళ్ల సవాల్

దేశం యావత్తు డిజిటల్ బాట పట్టనుంది. పల్లెల నుంచి పట్నాల వరకు అంతటా మొబైల్ లోనే పనులన్నీ సాగిపోతున్నాయి. ఇది ఒకవైపు మాత్రమే. మరోవైపు కొత్తకొత్త మాల్‌వేర్‌లు, వైరస్‌లూ పెరుగుతున్నాయి. వీటిని అడ్డుకోవడం పెను సవాల్‌గా మారుతోంది. అయితే వీటికి భద్రత అంతంత మాత్రమేనని .. జర భద్రమంటోంది తాజాగా రిలీజైన అసోచామ్ రిపోర్ట్.  ప్రస్తుతం 40 నుంచి 45 శాతం వరకు సాగుతున్న డిజిటల్ ట్రాన్సాక్షన్స్… వచ్చే ఏడాది 60 నుంచి 65 శాతం వరకు పెరగొచ్చంటున్నారు. సైబర్‌ నేరాలను అడ్డుకునేందుకు వ్యూహాత్మక చర్యలు అనే అంశంపై అసోచాం – ఈవై  సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఇది తేలింది. క్రెడిట్‌/డెబిట్‌ కార్డుల మీద జరిగే సైబర్‌ దాడులు గత మూడేళ్లలో ఆరు రెట్లు పెరిగాయి. చాలా జాగ్రత్తగా ఉంటే కానీ వీటి నుంచి బయటపడలేమంటోంది ఈ రిపోర్ట్. సంస్థలు తమ ఆర్థిక, మేధోపరమైన, వినియోగదారుల సమాచారాన్ని పెరుగుతున్న ముప్పుల నుంచి కాపాడుకునేందుకు, నిఘా కోసం లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించింది. సైబర్ నేరాలపై ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలని తెలిపింది. విదేశాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని తెలిపింది. దీన్నే మొదటి ప్రాధాన్యంగా తీసుకుంటూ కేంద్రం ముందుకు అడుగులువేయాలని నివేదిక పేర్కొంది.

నోట్ల మార్పిడిలో RBI అధికారి అరెస్ట్

తీగ లాగితే ట్రంక్ పెట్టెలు కదులుతున్నాయి. దాడులు చేసే కొద్దీ కోట్లకు కోట్ల కొత్త నోట్లు బయట పడుతున్నాయి. బెంగళూరులో CBI, ED అధికారుల వరస దాడులు కలకలం రేపుతోంది. బడాబాబులకు నోట్ల మార్పిడికి సహకరిస్తున్న RBI అధికారి మైఖేల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఎవరెవరికి ఎంతెంత డబ్బు.. ఎంత కమీషన్ కింద మార్చింది ప్రశ్నిస్తున్నారు సీబీఐ అధికారులు. ఇప్పటి వరకు కోటిన్నర వరకు మార్చినట్టు గుర్తించారు. మైఖేల్ పై చాలా ఆరోపణలు రావటం.. కోట్లలో పాతనోట్లకు కొత్త 2వేల నోట్లు ఇచ్చినట్లు.. సీబీఐకి వచ్చిన సమాచారం ఆధారంగా విచారణ చేపడుతున్నారు.

మరో కేసులో రూ.92 లక్షలు పట్టివేత

మరో కేసులో.. బెంగళూరులో భారీగా కొత్త నోట్లు పట్టుబడ్డాయి. 92 లక్షల 2 వేల రూపాయల నోట్లు తరలిస్తుండగా ఏడుగురిని పట్టుకున్నారు కర్ణాటక ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు. 15 నుంచి 35 శాతం కమీషన్ తీసుకుంటుండగా అధికారులు అరెస్ట్ చేశారు. ఈ మార్పిడి ముఠాలో ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల బంధువులు ఉన్నారు. బ్యాంక్ సిబ్బందే ఇలా పక్కదారిలో కోట్లకు కోట్లు తరలిస్తుండటంపై కేంద్రం సీరియస్ గా ఉంది. ఇప్పుడు దొరికిన డబ్బుతోపాటు.. ఈ 30 రోజుల్లో ఇంకెంత డబ్బును అక్రమంగా మార్చారు.. తరలించారు అనే విషయంపైనా ఆరా తీస్తున్నారు ED అధికారులు.

కొత్త నోట్ల తరలింపులో బ్యాంక్ సిబ్బంది బంధువులు

కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో భారీగా కొత్త నోట్లు పట్టుబడుతున్నాయి. 92 లక్షల 2 వేల రూపాయల నోట్లు తరలిస్తుండగా ఏడుగురిని పట్టుకున్నారు కర్ణాటక ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు.
పాతనోట్లను మార్చేందుకు  15 నుంచి 35 శాతం కమిషన్ తీసుకుంటుండగా అధికారులకు దొరికారు. ఈ మార్పిడి ముఠాలో ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల బంధువులు ఉన్నారు. బ్యాంక్ ఉద్యోగుల పాత్రపై ఇప్పటికే చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బెంగళూరులో ఓ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగి బంధువులు.. రూ.92లక్షల 2వేల నోట్లతో దొరకటం కలకలం రేపుతోంది. బ్యాంక్ సిబ్బందే ఇలా పక్కదారిలో కోట్లకు కోట్లు తరలిస్తుండటంపై కేంద్రం సీరియస్ గా ఉంది. ఇప్పుడు దొరికిన డబ్బుతోపాటు.. ఈ 30 రోజుల్లో ఇంకెంత డబ్బును అక్రమంగా మార్చారు.. తరలించారు అనే విషయంపైనా ఆరా తీస్తున్నారు ED అధికారులు.

ఆన్‌లైన్ చెల్లింపులు అదుర్స్‌

పెద్దనోట్ల రద్దు తర్వాత.. బ్యాంకుల్లో నగదు నిల్వలు లేవు.. ఏటీఎంలు తెరుచుకోవడం లేదు.. చేతిలో చిల్లర లేక ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే.. మరోవైపు ప్రజలు నెమ్మదిగా నగదు రహితం వైపు మళ్లుతున్నారు. ఆన్ లైన్ చెల్లింపులు, కొనుగోళ్లకు అలవాటు పడుతున్నారు.  
పెద్దనోట్ల రద్దు తర్వాత ఆన్ లైన్ చెల్లింపులు అదుర్స్ అనిపిస్తున్నాయి. ఆన్ లైన్ కోనుగోళ్లు కూడా ఊపందుకున్నాయి. ప్రజలు నెమ్మదిగా నగదు రహితం వైపు అడుగులేస్తున్నారు. ఇంటర్నెట్‌, మొబైల్‌, ఎస్‌ఎంఎస్‌ బ్యాంకింగ్‌, ఏటీఎం కార్డు, చెక్‌ బుక్‌ల కోసం బ్యాంకులకు క్యూ కడుతున్నారు. గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు ఎక్కువగా జరిగాయి. బ్యాంకు ఖాతాల్లో నగదు డిపాజిట్లు, డెబిట్‌, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు రెట్టింపయ్యాయని ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెలలో గత నెల కంటే 50-100 శాతం ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరిగే అవకాశాలున్నాయని.. గడిచిన వారం రోజుల గణాంకాల ద్వారా అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ జరిగిన ఈ-చెల్లింపులపై ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాల్ని పరిశీలిస్తే ఈ విషయం వెల్లడవుతోంది. లావాదేవీల సంఖ్యతో పాటు ఆయా లావాదేవీల విలువ మొత్తమూ భారీగా పెరుగుతోంది. ఆర్‌టీజీఎస్‌, ఎన్‌ఈఎఫ్‌టీ, సీటీఎస్‌ చెల్లింపులు సెలవు దినాల్లో జరగనందున... ఎనిమిది రోజులకే లెక్కించారు. నవంబరు నెలలో మొత్తం 67.15 కోట్ల ఆన్‌లైన్‌ చెల్లింపులు జరిగితే... డిసెంబరులో 9వ తేదీ నాటికి 29.7 కోట్ల లావాదేవీలు జరిగాయి. మొత్తంగా...  దేశవ్యాప్తంగా ప్రజలందరూ పెద్దనోట్ల రద్దును ప్రశంసిస్తూ నగదు రహితంపై అడుగులేస్తున్నారు.

Monday 12 December 2016

అమ్మ బుగ్గ‌పై ఆ రంధ్రాలు ఏంటి..?

జయలలితకు చికిత్స జరిగిన విధానం అత్యంత రహస్యంగా ఉంది. అపోలో ఆసుపత్రిలో ఎప్పుడేం జరిగిందో స్పష్టంగా వెల్లడికావడం లేదు.  ఆమె పార్థివ దేహాన్ని అత్యంత సమీపం నుంచి చాలా మంది చూశారు. ‘అమ్మ బుగ్గపై ఆ రంధ్రాలేంటీ’? అంటూ ఈ సామాజిక మాధ్యమంలో ఈ దృశ్యం జోరుగా చక్కర్లు కొడుతోంది. జయలలిత మరణించిన తరువాత ఆమె భౌతిక కాయాన్ని ఎంతో మంది తిలకించారు. అయితే ఆమె ఎడమ బుగ్గపై నాలుగు రంధ్రాలు ఆసక్తి రేపాయి. చెంపపైన ఆ రంధ్రాలు ఏంటీ అనే చర్చ ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సహజంగా ఎవరైనా మరణిస్తే.. వారి మృతదేహం కొన్ని రోజుల పాటు పాడవకుండా, కుళ్లి పోకుండా ఉండేలా వైద్యులు ‘ఎంబామింగ్‌‌’ చేస్తుంటారు. దేహాన్ని కొన్ని రకాల రసాయనాలు, మందులతో శుద్ధి చేయడంతో పాటు,  దేహం కుళ్లిపోకుండా సూది కూడా వేస్తుంటారు. మృతదేహంలోని రక్తాన్ని బయటకు తీసేసి ఈ రసాయన మందును లోనికి పంపే ప్రక్రియ ఇది. అయితే సహజంగా ఈ సూదిని మెడ వెనుక లేదా.. గజ్జల్లో వేస్తుంటారు. జయలలిత పార్థీవదేహానికి కూడా ఈ తరహా ప్రక్రియ వైద్యులు నిర్వహించి ఉండే అవకాశాలు ఉన్నాయి. జయలలితకు గుండె పోటు వచ్చినప్పటి నుంచి ఆమె మరణించే సమయం వరకూ వైద్యులు ‘ఎక్మో’ చికిత్స చేశారు. ఆ ప్రక్రియలోనే ‘ఎంబామింగ్‌‌’ కూడా నిర్వహించవచ్చు. ప్రత్యేకంగా సూదులు వేయాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. అయితే వీటికి భిన్నంగా జయ బుగ్గలపై ఇలా నాలుగు రంధ్రాలు కనిపిస్తుండటంతో అది ‘ఎంబామింగ్‌‌’ సూదితో ఏర్పడిన రంధ్రాలా.. లేదా ఇతర చికిత్సలు చేయడానికి వీలుగా చేసిన రంధ్రాలా అని చర్చ జోరుగా జరుగుతోంది.  అయితే జయలలిత బుగ్గపై కనిపిస్తున్న నాలుగు రంధ్రాలు ఏవిధంగా ఏర్పడ్డాయో అర్థం కావడం లేదని అనేక మంది అంటున్నారు.