cricket ad

Tuesday 13 December 2016

ఫోర్బ్స్‌లో ఇద్దరు భారతీయ అమెరికన్లు

న్యూయార్క్‌: అమెరికాలో సంపన్నులైన పారిశ్రామికవేత్తల జాబితానుప్రముఖ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ విడుదల చేసింది. 40ఏళ్లలోపు వయసు కలిగిన సంపన్న పారిశ్రామికవేత్తల జాబితాలో భారత సంతతికి చెందిన ఇద్దరు అమెరికన్లకు చోటు లభించింది. కాగా, ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఈ జాబితాలో తొలిస్థానంలో నిలిచారు. బయోటెక్‌ పారిశ్రామికవేత్త వివేక్‌ రామస్వామి 24వ స్థానంలో నిలిచారు. ఆయన మొత్తం సంపద విలువ 600 మిలియన్‌ డాలర్లు. ఇక అపూర్వ మెహతా 360 మిలియన్‌ డాలర్ల సంపదతో 31 స్థానాన్ని దక్కించుకున్నారు.
రామస్వామి(31), హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం, యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో విద్యను అభ్యసించారు. బయోటెక్‌ రంగంలో కంపెనీని స్థాపించి వృద్ధి పథంలో దూసుకుపోతున్నారని ఫోర్బ్స్‌ తెలిపింది. ఈయన కంపెనీ 2016లో స్టాక్‌మార్కెట్‌లో ముందస్తు పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీవో)కు వచ్చింది. దీని ద్వారా ఆయన 218 మిలియన్‌ డాలర్ల షేర్లను నాస్‌డాక్‌లో విక్రయించారు.
ఇక మెహతా సిలికాన్‌ వ్యాలీలోని యువ పారిశ్రామిక వేత్తల్లో ఒకరుగా నిలిచారని ఫోర్బ్స్‌ అభివర్ణించింది. భారత్‌లో పుట్టిన మెహతా కుటుంబం 2000 సంవత్సరంలో కెనడాకు వచ్చారు. వాటర్లూ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు. అనంతరం బ్లాక్‌ బెర్రీ, క్వాల్కమ్‌, అమెజాన్‌లలో పనిచేశారు. 2012లో నిత్యావసరాలను సరఫరా చేసే సంస్థ ‘ఇన్‌స్టాకార్ట్‌’ వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఉన్నారు. వినియోగదారులు మొబైల్‌ యాప్‌ ద్వారా నిత్యావసరాలను కొనుగోలు చేసుకోవచ్చు. 10 డాలర్లు చెల్లించడం ద్వారా రెండు గంటల్లోపు సరకులను పొందవచ్చు. మెహతా నిర్వహిస్తున్న ఈ కంపెనీ విలువ 2 బిలియన్‌ డాలర్లు అని ఫోర్బ్స్‌ తెలిపింది. ఈ జాబితాలో తొలిస్థానంలో నిలిచిన జుకర్‌బర్గ్‌ 50 బిలియన్‌ డాలర్ల సంపదను కలిగి ఉన్నారు.

డిజిటల్‌ ఇక జిగేల్‌ కొత్త పుంతలు తొక్కనున్న నగదు రహిత లావాదేవీలు నాలుగేళ్ల తర్వాత నోట్లు నామమాత్రమే

ఇదో మార్పు. వూహించని విప్లవం. వూహకందనంత వేగంగా జరుగుతున్న మార్పు. కష్టార్జితాన్ని నోట్ల రూపంలో చూసుకుని మురిసిపోయే ఈ దేశ ప్రజలు ఇప్పుడు శరవేగంగా డిజిటల్‌ లావాదేవీలవైపు మళ్లుతున్న కొంగొత్త పోకడ. దేశ ఆర్థిక వ్యవస్థలోకి ప్రవహిస్తోన్న కొత్త నీరు ఇది. రాబోయే నాలుగేళ్లలో డిజిటల్‌ లావాదేవీలు గణనీయంగా పెరుగుతాయన్న కన్సల్టింగ్‌ సంస్థల అంచనాలు ఈ మార్పునకు విస్పష్ట సూచికలు.
వినియోగంలో ఉన్న సౌలభ్యం, త్వరగా లావాదేవీ పూర్తిచేసే అవకాశం, నమ్మకం... తదితర ప్రయోజనాల వల్ల భారతీయులు మొదట్నుంచీ నగదు లావాదేవీలకే ప్రాధాన్యం ఇచ్చేవారు. అందుకే మన స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) లో నగదు వాటా ఎంతో అధికంగా 18 శాతం ఉంటుంది. అదే బ్రిటన్‌లో 3.5 శాతం, అమెరికాలో 8 శాతం మాత్రమే. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా మనదేశంతో పోలిస్తే బ్రెజిల్‌, చైనా వేగంగా అడుగులు వేస్తున్నాయి. 2015 లో మొత్తం చెల్లింపుల్లో నగదు చెల్లింపుల వాటా అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ తదితర అభివృద్ధి చెందిన దేశాల్లో 20 నుంచి 25 శాతం ఉండగా, మనదేశంలో మాత్రం ఎంతో అధికంగా 78 శాతం ఉన్నాయి. మిగిలిన 22 శాతం లావాదేవీల్లో డిజిటల్‌ పద్ధతిలో జరిగిన లావాదేవీలు 13 శాతం కాగా, 7 శాతం కార్డు చెల్లింపులు, 2 శాతం చెక్కుల ద్వారా జరిగిన చెల్లింపులు ఉన్నాయి. కానీ ఈ పరిస్థితి ఇకపై ముందు పూర్తిగా మారిపోనుంది. నగదు ప్రధాన ఇంధనంగా నడిచే మనదేశ ఆర్థిక వ్యవస్థకు డిజిటల్‌ చెల్లింపులు వెనుదన్నుగా నిలవనున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయమైన రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రధాన కారణం.
అంచనాల కంటే మిన్నగా... 
వాస్తవానికి గత కొంతకాలంగా మనదేశంలో డిజిటల్‌ లావాదేవీలు పెరుగుతూ వస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ల వాడకం అధికం కావటం, ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావటం, బ్యాంకింగ్‌ సేవల విస్తృతి, డెబిట్‌/ క్రెడిట్‌ కార్డుల జారీ అదికం కావటం, మొబైల్‌ వ్యాలెట్లు, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ... తదితర కారణాల వల్ల డిజిటల్‌ దిశగా మనదేశం అడుగులు వేస్తోంది. అందుకే భారతదేశంలో డిజిటల్‌ లావాదేవీల పరిమాణం గణనీయంగా పెరగబోతోందని, ఇది నగదు చెల్లింపుల పరిశ్రమలోని సంస్థలకు మేలు చేసే అంశమని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూపు (బీసీజీ) ఈ ఏడాది జులై లో రూపొందించిన నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం 2020 నాటికి మనదేశంలో డిజిటల్‌ చెల్లింపులు 500 బిలియన్‌ డాలర్లకు (రూ.34 లక్షల కోట్లు) చేరుకుంటుంది. ప్రస్తుతం ఈ మొత్తం 40 బిలియన్‌ డాలర్ల నుంచి 50 బిలియన్‌ డాలర్ల వరకూ ఉంది. ఈ అంచనా ఆరు నెలల క్రితం నాటిది. గత నెల 8న ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన నిర్ణయంతో పరిస్థితి మారిపోయి డిజిటల్‌ లావాదేవీలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. డిజిటల్‌ లావాదేవీలు ఒక్కసారిగా అధికం అవుతున్నాయి. దీంతో 2020 నాటికి బీసీజీ అంచనా వేసిన మొత్తం కంటే ఎంతో అధికంగా డిజిటల్‌ లావాదేవీలు నమోదు అవుతాయని స్పష్టమవుతోంది.
ప్రస్తుత చెల్లింపుల స్థితి... 
* దేశీయంగా 2015 లో నమోదైన మొత్తం చెల్లింపుల్లో నగదు చెల్లింపులు 78 శాతం ఉన్నాయి. 2010 లో నగదు చెల్లింపులు 89 శాతం, 2005లో 92 శాతం ఉండటం ప్రత్యేకత. పదేళ్ల కాలంలో నగదు చెల్లింపులు 14 పర్సెంటేజీ పాయింట్ల మేరకు తగ్గిపోయినట్లు స్పష్టమవుతోంది. 
* నగదు లావాదేవీల సంఖ్యను 2023 నాటికి నగదు రహిత లావాదేవీలు మించిపోతాయని బీసీజీ (బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌) తన నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం 2015 లో 22 శాతం ఉన్న నగదు రహిత లావాదేవీలు 2020 నాటికి 40 శాతానికి పెరగనున్నాయి. 2025 నాటికి 59 శాతానికి పెరుగుతాయి. 
* నగదు రహిత లావాదేవీల్లో భాగంగా ఉన్న డిజిటల్‌ లావాదేవీలు 2020 నాటికి 26 శాతానికి, 2025 నాటికి 37 శాతానికి పెరుగుతాయని అంచనా. మొబైల్‌ వ్యాలెట్‌, స్టోర్‌ క్రెడిట్‌, ప్రీపెయిడ్‌ కార్డులు, గిఫ్ట్‌ కార్డుల వాడకం గణనీయంగా విస్తరించే అవకాశం ఉంది.
చెల్లింపుల పరిశ్రమకు మంచి రోజులు 
డిజిటల్‌ చెల్లింపులు పెరుగుతున్న ఫలితంగా మనదేశంలో అతిపెద్ద చెల్లింపుల పరిశ్రమ రూపుదిద్దుకోనుంది. బీజీసీ అంచనా ప్రకారం 2020 నాటికి డిజిటల్‌ చెల్లింపుల పరిశ్రమ టర్నోవర్‌ 5 బిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ. 3,40,000 కోట్లు) చేరుతుంది. దీని ప్రకారం చూస్తే ఈ విభాగంలో కార్యకలాపాలు సాగించే సంస్థలకు ఆకాశమే హద్దుగా వ్యాపార అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డెబిట్‌/ క్రెడిట్‌ కార్డులు తయారు చేసే సంస్థలకు/ పీఓఎస్‌ (పాయింట్‌ ఆఫ్‌ సేల్‌) యంత్రాలు తయారు చేసే సంస్థలకు ఇప్పటికే పెద్దఎత్తున కొత్త ఆర్డర్లు లభిస్తున్నాయి. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయనేదానికి ఇవన్నీ సంకేతాలే.

కేరళ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఆరుగురు అరెస్టు

తిరువనంతపురం: అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో జాతీయగీతం ప్రదర్శించే సమయంలో ఆరుగురు వ్యక్తులు లేచి నిలబడకపోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. తిరువనంతపురంలోని నిషాగాంధీ ఆడిటోరియంలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ప్రారంభమైంది. కార్యక్రమంలో భాగంగా ఈజిప్టు చిత్రాన్ని ప్రదర్శించే ముందు జాతీయగీతాన్ని ప్రదర్శించారు.



 ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు హాజరైన ఆరుగురు వ్యక్తులు జాతీయగీతం వచ్చే సమయంలో లేచి నిలబడలేదు. పోలీసులు, ఐఎఫ్‌ఎఫ్‌కే నిర్వాహకులు, ఛైర్మన్‌ కమల్‌తో పాటు పలువురు.. వారిని నిలబడమని కోరినా తిరస్కరించారు. దీంతో పోలీసులు ఆ ఆరుగురిని అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా జాతీయగీతం ప్రదర్శించే ముందు యువత లేచి నిలబడకపోవడంపై భాజపా యూత్‌ వింగ్‌ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం చెన్నైలోను ఇలాంటి ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

స్టార్‌ హీరోయిన్‌ నోట షాకింగ్‌ మాట

చిన్నతనంలో తాను లైంగిక వేధింపులకు గురయ్యానని బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ అన్నారు. అనుష్క శర్మ, విద్యాబాలన్‌, రాధికా ఆప్టే, ఆలియాభట్‌లతో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సోనమ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సమావేశంలో సినీ విమర్శకుడు రాజీవ్‌ మసంద్‌తో సోనమ్‌ మాట్లాడుతూ.. 




‘నాకు తెలుసు. చిన్నవయసులోనే నేను లైంగిక వేధింపులకు గురయ్యాను. ఆ అనుభవం చాలా బాధాకరంగా ఉంటుంది’ అన్నారు. నటుడు అనిల్‌ కపూర్‌ కుమార్తైన ఆమె ఈ మాట అనడంతో ఆ చర్చలో పాల్గొన్నవారే కాక చిత్ర పరిశ్రమ, ఫ్యాన్స్‌ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.



2016 సంవత్సరంలో బాలీవుడ్‌లో తమ నటనా సామర్థ్యంతో మంచి విజయాలు సాధించిన నటీమణులతో రాజీవ్‌ మసంద్‌ ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఇలా తమ అనుభవాలను ప్రేక్షకులతో పంచుకోవడం ద్వారా మిగిలిన మహిళల్లో చైతన్యం కలుగుతుందనే ఈ అంశాన్ని చర్చించినట్లు వారు పేర్కొన్నారు. మొదటినుంచి చాలా నిర్మొహమాటంగా మాట్లాడతారన్న పేరున్న సోనమ్‌ ఇక్కడ కూడా తనదైన శైలిలో కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారు.

బ్యాంకుల్లో అక్రమాలపై సీరియస్..! దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో సోదాలు..!

పెద్దనోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కొంత మంది బ్యాంకు సిబ్బంది నల్లకుబేరులతో కుమ్మక్కై అక్రమాలకు తెరతీశారు. కమిషన్ తీసుకుని పాత నోట్లను భారీ ఎత్తున మారుస్తున్నారు. ఈ క్రమంలో, బ్యాంకులకు డబ్బు వస్తున్నప్పటికీ, సామాన్యులకు మాత్రం అందుబాటులోకి రాకుండా పోతోంది. దీంతో, ఈ అంశంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించింది.
దేశవ్యాప్తంగా 54 బ్యాంకులపై ఈడీ దాడులు నిర్వహించింది. బ్యాంకులపై దాడి చేసి, తనిఖీలు నిర్వహిస్తోంది. డబ్బు రవాణా, మనీ లాండరింగ్ అంశాలపై కూడా ఆరా తీస్తోంది. ఈడీ దాడులు చేసిన బ్యాంకుల్లో ప్రముఖ బ్యాంకులన్నీ ఉన్నాయి.
ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఇటీవలే పలువురు బ్యాంకు అధికారులపై కేంద్రం కొరడా ఝళిపించిన సంగతి తెలిసిందే. పలువురి సస్పెండ్ చేయడంతో పాటు పలువురిని బదిలీ చేసింది.

రూ.500కోట్లతో కూతురి పెళ్లి చేసిన గాలి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!

500 కోట్ల రూపాయల ఖర్చుతో కూతురి పెళ్లి అంగరంగ వైభవంగా పెళ్లి చేసిన కర్నాటక మైనింగ్ డాన్, మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గాలి జనార్దన రెడ్డిపై నల్ల ధనం మార్పిడి ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాలి జనార్దన రెడ్డి సన్నిహితుడు, భూ సమీకరణ ప్రత్యేక అధికారి భీమా నాయక్ ను పోలీసులు అరెస్టు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి వద్ద ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు సాయం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భీమా నాయక్ తో పాటు అతని కారు డ్రైవర్ మహ్మద్ ను గుల్బర్గాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె పెళ్లి సమయంలో సుమారు రూ.100 కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు భీమా నాయక్ సహాయాన్ని తీసుకున్నారని, ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ నాయక్ కారు డ్రైవర్ రమేశ్ గౌడ తన సూసైడ్ నోట్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.
గాలి జనార్దన్ రెడ్డి తన కూతురి పెళ్లికి డబ్బుని నీళ్ల ప్రాయంలా ఖర్చు చేశారు. పెళ్లి కూతురి చీర ఖరీదే 17 కోట్ల రూపాయలు కాగా, ఆభరణాల ఖరీదు 90కోట్ల రూపాయలు. నోట్లరద్దు వేళ దేశవ్యాప్తంగా ప్రజలు కరెన్సీ కోసం పాట్లు పడుతుంటే, 2వేల రూపాయల నోటు దొరకడం కూడా గగనంగా ఉంటే, గాలి జనార్దన రెడ్డి మాత్రం కోట్ల రూపాయల డబ్బుని అవలీలగా ఖర్చు చేయడం సంచలనంగా మారింది.

సెల్ ఫోన్లకు సైబర్ కేటుగాళ్ల సవాల్

దేశం యావత్తు డిజిటల్ బాట పట్టనుంది. పల్లెల నుంచి పట్నాల వరకు అంతటా మొబైల్ లోనే పనులన్నీ సాగిపోతున్నాయి. ఇది ఒకవైపు మాత్రమే. మరోవైపు కొత్తకొత్త మాల్‌వేర్‌లు, వైరస్‌లూ పెరుగుతున్నాయి. వీటిని అడ్డుకోవడం పెను సవాల్‌గా మారుతోంది. అయితే వీటికి భద్రత అంతంత మాత్రమేనని .. జర భద్రమంటోంది తాజాగా రిలీజైన అసోచామ్ రిపోర్ట్.  ప్రస్తుతం 40 నుంచి 45 శాతం వరకు సాగుతున్న డిజిటల్ ట్రాన్సాక్షన్స్… వచ్చే ఏడాది 60 నుంచి 65 శాతం వరకు పెరగొచ్చంటున్నారు. సైబర్‌ నేరాలను అడ్డుకునేందుకు వ్యూహాత్మక చర్యలు అనే అంశంపై అసోచాం – ఈవై  సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఇది తేలింది. క్రెడిట్‌/డెబిట్‌ కార్డుల మీద జరిగే సైబర్‌ దాడులు గత మూడేళ్లలో ఆరు రెట్లు పెరిగాయి. చాలా జాగ్రత్తగా ఉంటే కానీ వీటి నుంచి బయటపడలేమంటోంది ఈ రిపోర్ట్. సంస్థలు తమ ఆర్థిక, మేధోపరమైన, వినియోగదారుల సమాచారాన్ని పెరుగుతున్న ముప్పుల నుంచి కాపాడుకునేందుకు, నిఘా కోసం లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించింది. సైబర్ నేరాలపై ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలని తెలిపింది. విదేశాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని తెలిపింది. దీన్నే మొదటి ప్రాధాన్యంగా తీసుకుంటూ కేంద్రం ముందుకు అడుగులువేయాలని నివేదిక పేర్కొంది.