cricket ad

Saturday 10 December 2016

లోక్‌సభలో నన్ను మాట్లాడనివ్వడం లేదు... రాష్ట్రపతి ఆవేదన చెందుతున్నారు : మోదీ

గొప్ప రాజకీయ అనుభవం ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రస్తుత పార్లమెంటు సమావేశాల తీరుపై తీవ్ర ఆవేదన చెందుతున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో దీసా వద్ద జరిగిన రైతు సభలో ఆయన మాట్లాడుతూ చర్చకు సిద్ధమేనని ప్రభుత్వం నిరంతరం చెప్తోందన్నారు. కానీ తనను లోక్‌సభలో మాట్లాడనివ్వడంలేదని మోదీ చెప్పారు. లోక్‌సభలో తనను మాట్లాడనివ్వకపోవడం వల్లే తాను జన సభలో మాట్లాడుతున్నానని తెలిపారు. మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభ్‌ భాయ్ పటేల్ పుట్టిన గడ్డపై నుంచి తాను ప్రతిపక్ష మిత్రులకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నానన్నారు. ఎన్నికల సమయంలో వాడివేడి చర్చలు జరిగిన విషయం వాస్తవమేనని, మనమంతా ఎక్కువ మంది ఓటర్లు ఓటు వేయాలని పిలుపునిచ్చామని చెప్పారు. అదేవిధంగా ప్రతిపక్ష సభ్యులు తనను వ్యతిరేకించవచ్చునని, అయితే ప్రజలకు బ్యాంకింగ్ గురించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆర్థిక లావాదేవీలను నిర్వహించడం గురించి వివరంగా చెప్పాలని కోరారు. పేదల గురించి కేవలం మాట్లాడటానికి, వాళ్ళ కోసం పని చేయడానికి చాలా తేడా ఉందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం పేదల కోసం పని చేస్తోందన్నారు.
 
పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 16న ప్రారంభమయ్యాయి. పెద్ద నోట్ల రద్దుపై చర్చ జరగాలంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు గట్టిగా కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు కార్యకలాపాలు సజావుగా సాగడంలేదు. అర్ధాంతరంగా వాయిదా పడుతున్నాయి. ఈ పరిస్థితిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పందిస్తూ ఎంపీలను ప్రజలు తమకు ప్రతినిధులుగా పార్లమెంటుకు పంపించారని, ఆ అవకాశాన్ని పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకోవడానికి ఉపయోగించవద్దని సుతిమెత్తగా హెచ్చరించారు.

జయలలిత ఒకరోజు ముందే చనిపోయారా?

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గుండెపోటుతో చనిపోయిన సంగతి తెలిసిందే. ఆసుపత్రి ప్రకటించిన వివరాల ప్రకారం ఆమె కన్నుమూసింది డిసెంబర్ 5న. కానీ ఆమె ఒకరోజు ముందే చనిపోయిందని తెలుస్తోంది. డిసెంబర్ 4న, ఆదివారమే ఆమె కన్నుమూసినట్లు సమాచారం. అన్నాడీఎంకే నేతలు ఆదివారం సాయంత్రం నుంచే అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఆమె పార్థివదేహాన్ని ఉంచిన రాజాజీ హాల్‌ను కూడా శుభ్రం చేయాలని ఆదివారమే ఆదేశాలు అందాయట. దీంతో పార్టీ కీలక నేతలకు ఆమె చనిపోయిందన్న విషయం తెలిసుంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అపోలో ఆసుపత్రి యాజమాన్యం కూడా అధికార పార్టీ నేతల ఆదేశాల ప్రకారమే సోమవారం అర్థరాత్రి ప్రకటన చేసినట్లు సమాచారం. ఆమె ఆదివారమే చనిపోతే సోమవారం అర్థరాత్రి వరకూ ఎందుకు గోప్యంగా ఉంచారనేది అంతుచిక్కని ప్రశ్న. ఆ ఒక్కరోజులో ఏం జరిగిందనే విషయంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

శశికళపై సంచలన ఆరోపణలు చేసిన జయలలిత చెల్లి కూతురు!

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 5న అపోలో ఆస్పత్రిలో కన్నుమూసిన విషయం విదితమే. అయితే, ఆమె మరణానంతరం ప్రజల్లో ఎన్నో సందేహాలు, మరెన్నో అంతు చిక్కని ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. జయలలితది సహజ మరణం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. జయలలిత అక్కున చేర్చుకుని, సొంత మనిషి కంటే ఎక్కువగా నమ్మిన శశికళే జయలలిత హత్యకు కుట్రపన్నిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రిలో చికిత్స జరిగిన 75రోజులు సొంత మనుషులను కూడా ఆసుపత్రిలోకి రానివ్వకుండా, శశికళే అన్నీ తానై వ్యవహరించింది. దీంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
 
జయలలిత చిన్న చెల్లి కూతురు అమృత బెంగళూరులో ఉంటోంది. తమ ఆంటీతో మాట్లాడనివ్వకుండా శశికళ కుట్రపూరితంగా వ్యవహరించేదని అమృత చెప్పింది. జయలలిత ఆసుపత్రిలో ఉండగా చూడటానికి 3 సార్లు వెళ్లానని, ఒక్కసారి కూడా శశికళ తనను లోపలికి అనుమతించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. జయలలిత ఆస్తిని ప్రభుత్వ పరిధిలోకి తెచ్చి తమిళనాడు ప్రజలకు దక్కేలా చూడాలని, అప్పుడే ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుందని అమృత భావించింది. జయలలిత ఆస్తి దక్కించుకోవాలని శశికళ కుట్ర పన్నిందని అమృత సంచలన ఆరోపణలు చేశారు.

వాళ్ళను బలోపేతం చేయడానికే నోట్ల రద్దు : ప్రధాని మోదీ

 పెద్ద నోట్ల రద్దు వల్ల విచారంగా ఎవరున్నారో, ఎవరు బలపడుతున్నారో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వివరించారు. అవినీతి వల్ల పేదలు, సామాన్యులు అనుభవిస్తున్న ఇబ్బందులను గుర్తు చేశారు. కరెన్సీ కష్టాల నుంచి ఎలా గట్టెక్కాలో వివరించారు. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో దీసా వద్ద అమూల్ పాల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. ‘అమూల్ దేశీ’ ఏ2 ఆవు పాలను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన రైతు సభలో మోదీ మాట్లాడారు.
 
ఇప్పుడు ఎక్కడ చూసినా పెద్ద నోట్ల రద్దు గురించే మాట్లాడుకుంటున్నారని, పేదలను బలోపేతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మోదీ చెప్పారు. రూ.500, రూ.1,000 నోట్ల రద్దు వల్ల రూ.50, రూ.100 నోట్ల విలువ పెరిగిందన్నారు. అంతేకాకుండా ఉగ్రవాదులను, నకిలీ కరెన్సీ ముఠాలను బలహీనపరచగలిగామని పేర్కొన్నారు. అవినీతి వల్ల ఎవరు నిరుత్సాహపడుతున్నారని ప్రశ్నిస్తూ అవినీతికి పాల్పడుతున్నవాళ్ళకు విచారం లేదని, పేదలు, సామాన్యులే అవినీతి వల్ల ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ‘నాకేం ఒరిగింది’ అని ఆలోచించని మనుషులున్న దేశంలో మనం ఉన్నామన్నారు. మన దేశం స్వార్థపూరితమైనది కాదన్నారు. మనమంతా మన భావి తరాల గురించి ఆలోచిస్తామన్నారు. పేదల గురించి మాట్లాడటానికి, వారికోసం పని చేయడానికి తేడా ఉందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తోందని తెలిపారు. ‘‘50 రోజుల సమయం ఇవ్వమని అడిగాను. పరిస్థితులు ఎలా మారుతాయో మీరే చూస్తారు. అవినీతి నుంచి దేశాన్ని బయటపడేసేందుకు ఇది కీలకమైన ముందడుగు’’ అని మోదీ చెప్పారు.
 
‘‘నల్లధనం పోగేసుకున్న బ్యాంకు అధికారులు, ఇతరులు ఎలా అరెస్టవుతున్నారో చూడండి. దొడ్డిదారిన తప్పించుకోగలమని వాళ్ళు అనుకున్నారు, కానీ దొడ్డిదారిలో కూడా కెమెరాలను మోదీ అమర్చినట్లు వాళ్ళు తెలుసుకోలేదు’’ అని ప్రధాని మోదీ తెలిపారు. ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నానన్నారు. ఈ-బ్యాంకింగ్, ఈ-వాలెట్‌లను అలవాటు చేసుకుంటే ఏటీఎంలు, బ్యాంకుల వద్ద నిల్చుని సమయాన్ని వృథా చేసుకోవలసిన అవసరం ఉండదన్నారు. ఈ-వాలెట్లు బ్యాంకులను మీ మొబైల్స్‌లోకి తీసుకొచ్చాయన్నారు.

అన్నీ తెలిసినా ‘అమ్మ’ ఎందుకు ఊరుకుందంటే..

తమిళనాడు దివంగత సీఎం జయలలిత ఆస్తుల కేసు విచారణ సందర్భంగా బెంగళూరులో మన్నార్‌గుడి మాఫియా రహస్య సమావేశం నిర్వహించినట్టు 2012లో తెహల్కా రిపోర్టర్ జీమన్ జాకబ్ బయట పెట్టారు. కుట్రలపై పోలీసులు సమగ్ర నివేదిక ఇచ్చినప్పటికీ శశికళ కుటుంబంపై జయలలిత చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాలనూ వివరించారు. జీమన్ కథనం ప్రకారం... శశికళ, ఆమె భర్త నటరాజన్, రావణన్ (శశికళ పినతండ్రి అల్లుడు) సహా ‘మన్నార్‌గుడి మాఫియా’లో మరో నలుగురు బెంగళూరులో రహస్యంగా సమావేశమైనట్టు నాటి డీజీపీ రామానుజం దృష్టికి వచ్చింది. అక్రమాస్తుల కేసులో జయలలితకు ఎదురయ్యే సమస్యలు, ముఖ్యమంత్రి పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలి అనే దానిపైనే ప్రధానంగా ఈ భేటీలో చర్చ జరిగింది. దీనిపై కర్నాటక డీజీపీ అప్పటి తమిళనాడు డీజీపీకి టేపులతో సహా సమాచారం ఇచ్చారు. ఈ టేపులను మొత్తం విన్న తర్వాత సీఎం జయలలిత వెంటనే స్పందించకుండా కొన్నిరోజులు అలాగే గడవనిచ్చారు. మరోవైపు డీజీపీ రామానుజం దీనిపై పకడ్బందీ ఆపరేషన్‌తో పక్కా ఆధారాలు సేకరించారు. ‘మన్నార్గుడి మాఫియా’పై పూర్తి నిఘావేయడంతో పాటు ఓ ప్రయివేటు డిటెక్టివ్ ఏజెన్సీనికి కూడా బాధ్యతలు అప్పగించారు. శశికళ కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఫోన్ సంభాషణలు  సేకరించి నేరుగా ముఖ్యమంత్రి జయలలితకు చేరవేశారు. ఈ వ్యవహారం మొత్తం తన దృష్టికి వచ్చినప్పటికీ... వారిపై చర్యలు తీసుకుంటే పార్టీపైనా, ప్రభుత్వంపైనా తీవ్ర ప్రభావం పడుతుందని జయలలిత భావించారు. దీంతో శశికళతో సన్నిహితంగా మెలుగుతున్న అధికారులను, మన్నార్గుడి మాఫియాకి సహకరిస్తున్న వారిని నెమ్మదిగా పక్కకు తొలిగించారు. తనకు పదేళ్లుగా వ్యక్తిగత భద్రతాధికారిగా పనిచేస్తున్న తిరుమలై స్వామిని సైతం సాగనంపారు. క్రమంగా మంత్రివర్గాన్ని శశికళ వ్యవహారంపై అప్రమత్తం చేస్తూ వచ్చారు. అయినప్పటికీ జయను ఏదోవిధంగా మచ్చిక చేసుకుని శశికళ తన వ్యవహారం చక్కబెట్టుకున్నట్టు జీమన్ వివరించారు.

భారతీయుల వీసా ఆశలపై ట్రంప్ నీళ్ళు

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా జనవరిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ లోపునే ఆయన మాటలు భారతీయులకు దడపుట్టిస్తున్నాయి. ప్రతిభావంతులైన భారతీయులు అమెరికాలో గొప్ప అవకాశాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటివారి ఆశలపై ట్రంప్ నీళ్ళు జల్లుతున్నారు. అయోవాలో తన మద్దతుదార్లతో ట్రంప్ మాట్లాడుతూ అమెరికన్లకు బదులుగా విదేశీ వర్కర్లను తీసుకోవడానికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు.


 డిస్నీ వరల్డ్, తదితర అమెరికా కంపెనీల్లో పరిస్థితులను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. అమెరికా ప్రజల్లో చిట్టచివరి వ్యక్తి జీవితాన్ని కూడా కాపాడేందుకు పోరాడాలని ట్రంప్ అన్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో తాను ఉద్యోగాలు కోల్పోయిన అనేకమంది అమెరికన్ వర్కర్లతో మాట్లాడానని చెప్పారు. వారికి బదులుగా తీసుకొచ్చిన విదేశీ వర్కర్లకు ఉద్యోగాలు కోల్పోయినవారిచేత బలవంతంగా శిక్షణ ఇప్పిస్తున్నారని చెప్పారు. 




‘‘మీకు బదులుగా వచ్చినవాళ్ళకు శిక్షణ ఇవ్వకపోతే మీ జీతం బాకీలు మీకు చెల్లించడం లేదు’’ అన్నారు. ఇటువంటి సంఘటనలను ఇకపై జరగనిచ్చేది లేదన్నారు. ట్రంప్ మాటలకు వేలాది మంది హర్షం వ్యక్తం చేశారు. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేస్తానని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. అమెరికాలోకి వచ్చిపడుతున్న మాదక ద్రవ్యాలు అమెరికా యువతను పాడుచేస్తున్నాయని, వాటిని అరికడతానని శపథం చేశారు.

సోషల్ మీడియా వేదికగా శశికళ మేనల్లుడు పెడుతున్న పోస్టులివి!

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన నేటికి ఐదురోజులైంది. ఈ ఐదు రోజుల నుంచి ఆమె మృతిపై అనేక సందేహాలు, ఊహాగానాలు. ఆమెను ఉద్దేశపూరితంగా హత్య చేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. కొందరు ప్రజలు ఒకడుగు ముందుకేసి సోషల్ మీడియా వేదికగా శశికళను జయ మృతికి ప్రధాన కుట్రధారిగా పేర్కొంటున్నారు. అయితే అన్నాడీఎంకే మాత్రం శశికళ చాలా ముఖ్యమైన వ్యక్తి అని, జయ విషయంలో అలా చేయదని సమర్థిస్తోంది. శశికళ పాత్రపై అనుమానాలున్నాయన్న వాదనల నేపథ్యంలో ఆమె మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా సరికొత్త ప్రచారానికి తెరలేపారు.
 
శశికళ మేనల్లుడు జియానంద్ దివాకరన్ తన ఫేస్‌బుక్ పేజ్ వేదికగా శశికళ గురించి ప్రచారం చేస్తున్నాడు. శశికళ కుటుంబం జయ కోసం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని అండగా నిలిచిందని జియానంద్ పోస్ట్ చేశాడు. జయలలితను మూడు సార్లు ప్రాణాపాయం నుంచి శశికళ సోదరుడు కాపాడాడని ఓ ఫోటో పోస్ట్ చేశాడు. జయలలిత ప్రతిపక్షంలో ఉండగా ఆమెపై లాఠీ చార్జి జరగకుండా ఉండేందకు శశికళ సోదరుడు దివాకరన్ లాఠీ దెబ్బలకు ఎదురునిలిచాడని పోస్ట్ చేశాడు. ఆ లాఠీచార్జ్‌లో దివాకరన్‌కు 14 చోట్ల గాయాలయ్యాయని పోస్ట్ చేశాడు.