cricket ad

Thursday 15 December 2016

ఆన్‌లైన్ లావాదేవీలు జరపండి.. రూ.340 కోట్లు గెలుచుకోండి

ఆన్‌లైన్ లావాదేవీలు ప్రోత్సహించేందుకు డబ్బులు గెలుచుకునే రెండు లక్కీ డ్రా పథకాలను కేంద్రం గురువారం ప్రకటించింది. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఈ స్కీమ్స్ వివరాలు వెల్లడించారు. వినియోగదారుల కోసం లక్కీ గ్రాహక్ యోజన, వ్యాపారుల కోసం డిజీధన్ వ్యాపారీ యోజన పథకాలు డిసెంబర్ 25న ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు.
డిసెంబర్ 25 నుంచి ఏప్రిల్ 14 వరకు సుమారు వంద రోజుల పాటు జరిపే డిజిటల్ లావాదేవీల్లో సుమారు రూ.340 కోట్లు గెలుచుకునే అవకాశముంది. కనిష్టంగా రూ.50 నుంచి గరిష్టంగా రూ.3000 వరకు జరిపే ఆన్‌లైన్ లావాదేవీలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. రోజువారి, వారం, మెగా అవార్డుల కేటగిరీల వారీగా సుమారు రూ.కోటి వరకు నగదు బహుమతులు గెలుచుకోవచ్చు.


వినియోగదారుల లక్కీ డ్రా కింద రోజుకు 15 వేల మందికి రూ.1000 చొప్పున వంద రోజులపాటు చెల్లిస్తారు. వీక్లీ డ్రాలో రూ.7000 నుంచి సుమారు లక్ష వరకు గెలుచుకునే అవకాశముంది. ఏప్రిల్ 14న నిర్వహించే మెగా డ్రాలో మొదటి బహుమతిగా కోటి రూపాయలు, రెండో బహుమతిగా రూ.50 లక్షలు, మూడో బహుమతిగా రూ.25 లక్షలు చెల్లిస్తారు.
 
వ్యాపారులకు వీక్లీ, మెగా లక్కీ డ్రాలు మాత్రమే వర్తస్తాయి. వీక్లీ డ్రాలో రూ.7000 నుంచి రూ.50,000 వరకు గెలుచుకునే అవకాశముంది. ఏప్రిల్ 14న నిర్వహించే మెగా అవార్డ్స్‌లో మొదటి బహుమతిగా రూ.50 లక్షలు, రెండో బహుమతిగా రూ.25 లక్షలు, మూడో బహుమతిగా రూ.5 లక్షలు చెల్లిస్తారు.
 
ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దుపై ప్రకటన చేసిన 2016 నవంబర్ 8 నుంచి 2017 ఏప్రిల్ 14 వరకు జరిపే ఆన్‌లైన్ లావాదేవీలను లెక్కలోకి తీసుకుంటారు. ఈ పథకాలను ప్రారంభించే డిసెంబర్ 25న తొలి లక్కీ డ్రా నిర్వహిస్తారు.

No comments:

Post a Comment