cricket ad

Tuesday 13 December 2016

నో క్యాష్‌.. ఓన్లీ గోల్డ్‌

దరాబాద్‌ సిటీ: అంతర్జాతీయ మాయగాళ్లు.. అంతర్రాష్ట్ర ముఠాలు.. అంతర్‌జిల్లా కేటుగాళ్లు.. అందరి చూపు హైదరాబాద్‌ వైపే. ఏటా ఏదో రూపంలో నగరవాసుల నుంచి 100-120 కోట్ల రూపాయలు కొట్టేస్తారు. రాష్ట్రంలో నమోదయ్యే పోలీసు కేసుల్లో మూడొంతులు ఇక్కడివే. ముందుగా స్కెచ్‌ గీయటం..రెక్కీ నిర్వహించటం.. తరువాత దోచుకోవటం..ఇదీ గృహదొంగతనాల్లో వ్యూహం. పోలీసులకు చిక్కితే గ్యాంగ్‌ సభ్యులంతా జైలు పాలవ్వాల్సిందే. అయినా ఇవేమీ లెక్కచేయకుండా అంతర్రాష్ట్ర ముఠాలు నగరాన్ని టార్గెట్‌ చేస్తూనే ఉంటాయి. ఇంతగా చెలరేగే చోరులకు పెద్దనోటు షాక్‌ ఇచ్చింది.దోపిడీలు.. దొంగతనాలతో దోచుకున్నా.. వాటిని మార్చటం ఇబ్బందిగానే మారింది. కరెన్సీ కట్టల జోలికి వెళ్లకుండా బంగారు, వెండి ఆభరణాలతో సరిపెడుతున్నారు. వాటిని రిసీవర్స్‌కు ఇచ్చి అమ్మించటం కంటే.. ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థల్లో తనఖా పెట్టి డబ్బు తీసుకుంటున్నారు. ఈ ఏడాది సాధారణ దొంగతనాల సంఖ్య పెరిగింది.. గృహ చోరీలు అధికమయ్యాయి.
ఎంతమార్పు 
మూడు స్నాచింగ్‌లు.. ఆరు దొంగత నాలతో హల్‌చల్‌ చేసే దొంగల హడావిడి తగ్గుతోంది. అక్కడక్కడా చోరీలకు పాల్పడినా బీరువాల్లో కనిపించే నోట్ల కట్టల జోలికి వెళ్లకుండా బంగారు ఆభరణాలు కొట్టేసి ఉడాయిస్తున్నారు. అంబర్‌పేటలో ఓ ఇంట్లో అర్ధరాత్రి వేళ దొంగ ప్రవేశించాడు. రూ.2లక్షల విలువైన పాతనోట్లు ఉన్నా వాటిని వదిలేసి నాలుగు తులాల బంగారు ఆభరణాలు తీసుకొని పారిపోయాడు. ముషీరాబాద్‌ పరిధిలో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని బీదర్‌ గ్యాంగ్‌ రెక్కీ నిర్వహించింది. వరుస ఇళ్లల్లో చోరీచేసి పారిపోవాలని పథకం వేసింది. కరెన్సీ కష్టాలతో ఆ ముఠా ప్రత్యా మ్నాయమార్గాలను ఎంచుకుంది. నకిలీ బంగారాన్ని తక్కువ ధరకు అమ్ము తామంటూ రంగంలోకి దిగింది. సికిందరాబాద్‌ వద్ద ఓ వ్యాపారికి టోకరా వేసి రూ.50వేలు మస్కా కొట్టింది. మరో అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు బ్యాంకుల వద్ద కాపుకాసి ఒంటరిగా వెళ్లే వారి వద్ద బ్యాగులు, నగలు కాజేసి పారిపోతున్నారు. 
లోకల్‌ గ్యాంగ్స్‌.. నయాస్టైల్‌ 
దొంగతనాలు.. చైన్‌ స్నాచింగ్‌లతో అలజడి సృష్టించిన ఘరానా దొంగల్లో 500 మందిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. వీరంతా జైల్లోనే ఉన్నారు. వీరిలో కరడుగట్టిన నేరస్థులపై రెండోసారి పీడీ యాక్ట్‌ ప్రయోగించి జైలుకు పంపుతున్నారు. గత ఏడాది అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో 420 సాధారణ దొంగతనాలు జరిగితే.. ఈ ఏడాది అదే రెండు నెలల్లో 445 జరిగాయి. 
గృహ దొంగతనాలు గతేడాదితో పోల్చితే 40 శాతం తగ్గాయి. ఘరానా దొంగలు.. జెళ్లలో ఉండటంతో అనుచరగణం.. చోటా నేరస్థులు.. జేబు దొంగతనాలు, మొబైల్‌ స్నాచింగ్‌లకు దిగు తున్నారు. ఆటోలు, ట్యాక్సీలు, ఆర్టీసీ సిటీ బస్సుల్లో ప్రయాణికుల ముసుగులో చోరీలు చేస్తున్నారు. పెద్దనోట్ల మార్పిడి, కరెన్సీ మాఫియా ముఠాల్లో ఏజెంట్లుగా మారుతున్నారు. 
టెక్నాలజీతో అడ్డుకట్ట 
పెరుగుతున్న నేరాలు, దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు నగర పోలీసు యంత్రాంగం టెక్నాలజీ వినియోగం పెంచింది. సీసీఎస్‌, సైబర్‌క్రైమ్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకే పరిమితం కాకుండా శాంతి భద్రతల విభాగంలోనూ పోలీసులు సాంకేతికతను ఉపయోగించాలంటూ నగర సీపీ మహేందర్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అన్ని ఠాణాల స్థాయిలో ఇన్‌స్పెక్టర్‌ నుంచి హోంగార్డు వరకూ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తున్నారు. బ్యాచ్‌ల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

No comments:

Post a Comment