cricket ad

Saturday 10 December 2016

వారసత్వ పోరాటం!


  • జయ ఆస్తుల కోసం మోహరింపు
  • ఒక వర్గం శశికళ వైపు, మరోవర్గం వ్యతిరేకం
చెన్నై, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి పదవి కోసం పోరాటం! పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కోసం పోరాటం! జయలలిత ఆస్తుల కోసం పోరాటం! ఈ మూడూ తనకే దక్కాలంటూ దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ చక్రం తిప్పుతున్నారు. ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి పదవులకు సంబంధించి ఇప్పటికే భిన్నాభిప్రాయాలు, వ్యతిరేకతలు వ్యక్తమయ్యాయి. తాజాగా, జయలలిత ఆస్తుల వారసత్వం కూడా తమిళనాట రచ్చగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. చట్ట ప్రకారం, రక్త సంబంధీకులెవరైనా ఉంటే జయ ఆస్తులు వారికే చెందుతాయి. అయితే, ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. జయ ఆస్తులపై పట్టు సాధించిన శశికళ.. ఆమె బంధువుల మధ్య చీలికలు తెచ్చేందుకు వ్యూహం రచించినట్లు తెలుస్తోంది.
జయ రక్త సంబంధీకులెవరు?
జయలలిత పుట్టుపూర్వోత్తరాల్లోకి వెళితే, ఎన.రాగచార్‌ కుమారుడు జయరాం. బెంగళూరులో ఆయన న్యాయవాద వృత్తి చేపట్టారు. ఆయన మొదటి భార్య జయమ్మ. ఈ దంపతులకు కలిగిన సంతానం వాసుదేవన. ప్రస్తుతం ఆయన తన భార్యాబిడ్డలతో మైసూరులోనే ఉంటున్నారు. జయమ్మ కన్నుమూయడంతో జయరాం వేదవల్లి అలియాస్‌ సంధ్యను వివాహం చేసుకున్నారు. అప్పటికి జయలలిత వయసు రెండేళ్లు. అనంతరం, జయరాం, వేదవల్లి దంపతులకు జయకుమార్‌ జన్మించాడు. ఈ జయకుమార్‌ 1995లో ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. జయకుమార్‌కు దీపక్‌, దీప అనే ఇద్దరు సంతానం. దీపక్‌ శశికళతో కలిసి జయ అంతిమ సంస్కారాల్లో పాల్గొనగా, దీపను మాత్రం దరి చేరనీయలేదు. ఇలా చూస్తే జయ రక్త సంబంధీకులు దీపక్‌, దీప మాత్రమే. కాగా, దీపక్‌ శశికళ బృందంవైపు చేరినట్లు తెలుస్తోంది. దీప తన మేనత్త వద్దకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పోయెస్‌ గార్డెనలో జయ మృతదేహానికి స్నానాదులు చేయించేటప్పుడు దీపను కూడా పిలవాలని కొందరు సీనియర్లు చెప్పినా, శశికళ బృందం నిరాకరించింది. రాజాజీ హాలు వద్ద జయ మృతదేహం ఉన్నప్పుడు అక్కడికొచ్చిన దీపను క్షణాల్లోనే పంపేశారు. జయ మృతదేహాన్ని తీసుకెళ్లే సైనిక శకటం ఎక్కేందుకు దీప చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. అయితే, దీపక్‌ను మాత్రం శశికళ భర్త నటరాజన తన వెంటే ఉంచుకున్నారు. ఉదయం నుంచీ తన వెంటే ఉంచుకున్న నటరాజన.. కనీసం బయటకు కూడా వెళ్లనీయలేదని సమాచారం. అలాగే, ఆయనకు అంతిమ సంస్కారాల్లో పాల్గొనేందుకూ అవకాశం ఇచ్చారు. దీంతో, దీపక్‌తో శశికళ బృందం టచలో ఉందని, అతన్ని దరి చేర్చుకునేందుకు సిద్ధంగా ఉందని అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. దీపను మాత్రం దరి చేరనిచ్చేది లేదని శశికళ కరాఖండీగా చెప్పినట్లు తెలిసింది. రక్త సంబంధీకులకే ఆస్తిపాస్తులు దక్కే అవకాశం ఉన్నందున, ఒకవేళ అలాంటిదేదైనా జరిగితే దీపక్‌ను ప్రయోగించవచ్చన్నది ఆమె వ్యూహంగా కనిపిస్తోంది. పోయెస్‌ గార్డెన ఆదిలో జయ మాతృమూర్తి సంధ్య పేరుపై ఉండేది. అనంతర కాలంలో జయకు వారసత్వంగా వచ్చింది. అంటే ఆ ఇల్లు దీపక్‌ నాయనమ్మది అవుతుంది. చట్ట ప్రకారం ఆ భవనానికి పూర్తి వారసుడు అతనే అవుతాడు. గతంలో ఎంజీఆర్‌ రాసిన వీలునామా వల్ల ఆయన ఆస్తులన్నీ తొలిగా న్యాయవాది ఎనసీ రాఘవాచారి పర్యవేక్షించారు. అనంతరం ఎంజీఆర్‌ బంధువైన రాజేంద్రన ఆధీనంలోకి వెళ్లాయి. అనంతరం జరిగిన పరిణామాల్లో ప్రస్తుతం అవి మద్రాస్‌ హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి పర్యవేక్షణలో ఉన్నాయి. అయితే, ఇలాంటివేవీ జరగకుండా దీపక్‌ను ప్రయోగించేందుకు శశికళ బృందం వ్యూహం రచిస్తోంది.

No comments:

Post a Comment