cricket ad

Friday 9 December 2016

ఫేస్‌బుక్‌లో తొలి స్థానం ఈ పండగదేనట!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫేస్‌బుక్‌.. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ ఉన్న వారందరికీ అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమం. ఆనందంగా గడిపిన క్షణాలనైనా, ఒక భావాన్నైనా దీని ద్వారానే నలుగురితో పంచుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇటీవల వివిధ అంశాలపై చర్చలకూ ఫేస్‌బుక్‌ వేదికవుతోంది. అయితే, ఈ ఏడాది మన దేశంలో ఎక్కువమంది దేని గురించి మాట్లాడారో తెలుసా? దీపావళి. అవును.. దేశవ్యాప్తంగా జరుపుకొనే ఈ పండగ గురించే ఈ ఏడాది ఎక్కువమంది చర్చించినట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించింది. మన దేశంతో పాటు అంతర్జాతీయంగా చర్చకు వచ్చిన తొలి పది అంశాల జాబితాను ‘ఫేస్‌బుక్‌ 2016 రివ్యూ’ పేరిట గురువారం విడుదల చేసింది.
మన దేశానికి సంబంధించి చర్చించిన అంశాల్లో దీపావళి తొలిస్థానంలో నిలవగా.. క్రికెట్‌ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. మూడోస్థానంలో.. ఉరీ ఉగ్రదాడి, దానికి కొనసాగింపుగా పాక్‌పై మన సైన్యం జరిపిన మెరుపుదాడులపై ఎక్కువగా చర్చించారట. దీంతో పాటు ధోనీ చిత్రం, ప్రముఖ డీజే హార్డ్‌వెల్‌ ఇండియా పర్యటన, ప్రియాంక చోప్రా, రియో ఒలింపిక్స్‌, పోకెమాన్‌గో, పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి, ఐఫోన్‌ 7 లాంచ్‌ గురించి చర్చించారని ఫేస్‌బుక్‌ తెలిపింది.
ఇక అంతర్జాతీయంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి ఎక్కువమంది చర్చించారు. ఆ తర్వాతి స్థానాల్లో బ్రెజిల్‌ రాజకీయాలు, పోకెమాన్‌గో రియాలిటీ గేమ్‌ చర్చకు వచ్చాయి. వీటితోపాటు ఒలింపిక్స్‌, బ్రెగ్జిట్‌ అంశాలు టాప్‌ 10లో చోటు సాధించాయి.
మొబైల్‌ వినియోగమే అధికం
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన ఫేస్‌బుక్‌కు దేశవ్యాప్తంగా నెలవారీ 16.6కోట్ల(166 మిలియన్ల) మంది యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు. దీనిలో 15.9కోట్ల (159 మిలియన్ల) మంది మొబైల్‌ ద్వారానే ఫేస్‌బుక్‌ వాడుతున్నారు. ఇక రోజువారీ యాక్టివ్‌ యూజర్ల సంఖ్య 8.5కోట్లు (85మిలియన్లు)కాగా.. మొబైల్‌లో 8.1కోట్ల(81మిలియన్ల) మంది ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్నారు.

No comments:

Post a Comment